
జులై నెలలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ బోర్డు.. జట్టును ప్రకటించింది. ఇక 2021 ఆగస్టులో చివరిగా టెస్ట్ మ్యాచ్ ఆడిన వెటరన్ స్పిన్నర్ యాసిర్ షా మళ్లీ టెస్ట్ మ్యాచ్లో పునరాగమనం చేయబోతున్నాడు. ఇకపోతే జట్టులో కొందరు కొత్త కుర్రాళ్లకు కూడా చోటు దక్కింది. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 18మందితో కూడిన సభ్యుల జట్టును ప్రకటించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ సిరీస్ లెక్కలోకి రాబోతుంది. దీంతో ఈ సిరీస్ను పాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఇక టెస్ట్ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్సీ వహించనున్నాడు. రెండు టెస్టుల్లో తొలి టెస్ట్ గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా.. రెండోది ఆర్. ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. జూలై 16న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక మొదటి టెస్టుకు ముందు పాకిస్థాన్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2015లో శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పుడు ఆతిథ్య జట్టును 2-1తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక పాకిస్థానీ చీఫ్ సెలెక్టర్ ముహమ్మద్ వాసిమ్ ఈసారి కూడా తమ ఆటగాళ్లు సిరీస్ గెలుచుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక వాసిమ్ మాట్లాడుతూ.. 'శ్రీలంకలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేము ఈ జట్టును సెలెక్ట్ చేశాం. సాధ్యమైనంత మేర మంచి ఆటగాళ్లతో కూడిన జట్టును సన్నద్ధం చేశాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు మాకు చాలా అవసరం కాబట్టి ఈ రెండు టెస్ట్ మ్యాచ్లు మా జట్టుకు చాలా కీలకం. సెలెక్ట్ అయిన ప్రతి జట్టు సభ్యుడికి శుభాకాంక్షలు. వారు మమ్మల్ని గర్వపడేలా చేస్తారని కచ్చితంగా భావిస్తున్నాను' అని పీసీబీ ప్రకటనలో వాసీమ్ పేర్కొన్నాడు.
శ్రీలంక టెస్టులకు పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, ఫవాద్ ఆలం, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నౌమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, షాన్ మసూద్ మరియు యాసిర్ షా