
హైదరాబాద్: పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. పాక్ జాతీయ టీ20 టోర్నీ అనంతరం క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇటీవలే అజ్మల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు.
40 ఏళ్ల అజ్మల్ పాకిస్థాన్ తరఫున 35 టెస్టులు ఆడి 178 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 184 వికెట్లు, 64 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు. పాక్ తరుపున చివరిసారిగా 2014లో శ్రీలంకతో గల్లెలో జరిగిన టెస్టులో కనిపించాడు. తన రిటైర్మెంట్ ప్రసంగంలో ఐసీసీతో పాటు పాక్ బోర్డుపై విమర్శలు చేశాడు.
అజ్మల్ బౌలింగ్ యాక్షన్పై మొదటి నుంచి వివాదం ఉన్న సంగతి తెలిసిందే. 2009లో ఆసీస్తో జరిగిన వన్డేలో అతని బౌలింగ్ శైలి (చకింగ్)పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత 2014లోనూ రెండోసారి మళ్లీ చకింగ్ చేస్తున్నాడని తేలడంతో ఐసీసీ రెండుసార్లు నిషేధం విధించింది.
దీంతో బౌలింగ్ శైలిని పూర్తిస్థాయిలో మార్చుకుని 2015లో పునరాగమనం చేసినప్పటికీ.. గతంలో మాదిరి రాణించలేక జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో తన బౌలింగ్ యాక్షన్పై ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని, ఐసీసీవన్నీ చెత్త రూల్స్ అంటూ మండిపడ్డాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బౌలర్లలో ఐసీసీ ప్రొటోకాల్ టెస్టులో 90 శాతం బౌలర్లు కచ్చితంగా ఫెయిలవుతారని అజ్మల్ తేల్చి చెప్పాడు. ఈ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు తన తరఫున కాస్త గట్టిగానే ఐసీసీతో పోరాడి ఉంటే తాను మరింత సంతృప్తిగా రిటైరై ఉండేవాడినని అజ్మల్ అన్నాడు.
'ఈ రోజు నేను రిటైరవుతున్నాను. ఇప్పుడు నాకు 40 ఏళ్లు. కాబట్టి నేను తప్పుకొని యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నాను. ఎంతో అసంతృప్తితో రిటైరవుతున్నా. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ. నా బౌలింగ్ శైలి సరిగా లేదంటూ నాపై రెండుసార్లు నిషేధం విధించింది. ఈ సందర్భంగా నేను ఐసీసీకి ఒక సవాల్ విసురుతున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న బౌలర్లకు ఒకసారి పరీక్ష నిర్వహించండి. అందులో 90శాతం మంది ఫెయిలవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని అజ్మల్ అన్నాడు.
తన కేసుని ఉపయోగించుకొని ఐసీసీ స్థాయిలో ఈ కఠినమైన ప్రొటోకాల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయం పోరాటం చేయాల్సి ఉందని అజ్మల్ పేర్కొన్నాడు. అంతేకాదు కొందరు ఆటగాళ్లకు పుట్టుకతోనే శారీరకంగా ఉండే సమస్యల వల్ల చేయి పూర్తిగా తిరగదని, మరికొందరికి ప్రమాదాల కారణంగా ఇలా జరుగుతుందని అన్నాడు.
అలాంటి వాళ్ల విషయంలో ఐసీసీ కాస్త ఉదారంగా ఉండాలని, అంతేతప్ప కచ్చితంగా నిబంధనలను పాటించాలని చెబితే ఇప్పుడున్న బౌలర్లలో 90 శాతం ఫెయిలవుతారని అన్నాడు. అయితే తన చేయి ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడానికి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదమే కారణమని అజ్మల్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఓ రోడ్డు ప్రమాదంలో తన చేయి కాస్త వంగిపోయిందని అజ్మల్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ అనేది ఓ గొప్ప ప్రాజెక్ట్ అని, అయితే బోర్డు దేశవాళీ క్రికెట్ని కూడా కాపాలాడని సూచించాడు.