హైదరాబాద్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 40 ఏళ్ల సయీద్ అజ్మల్ ప్రస్తుతం జరుగుతున్న పాక్ జాతీయ టీ20 టోర్నీ అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు.
'ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నీ తర్వాత క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటా. ఈ టోర్నీనే నాకు చివరిది. నా కెరీర్ బాగా సంతృప్తినిచ్చింది. నేను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరగలిగాను. పాక్కు కూడా మంచి విజయాలు అందించాననే నమ్ముతున్నా. దేశవాళీ టోర్నీలకు నన్ను ఎంపిక చేయడాన్ని ఎవరూ వేలెత్తిచూపకముందే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను' అని అజ్మల్ పేర్కొన్నాడు.
ఒకానొక దశలో వన్డే, టీ20ల్లో నంబర్వన్ బౌలర్గా అజ్మల్ వెలుగొందాడు. టెస్టుల్లోనూ అదే స్థాయిలో సత్తా చాటాడు. కానీ 2009లో ఆసీస్తో జరిగిన వన్డేలో అతని బౌలింగ్ శైలి (చకింగ్)పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత 2014లోనూ రెండోసారి మళ్లీ చకింగ్ చేస్తున్నాడని తేలడంతో ఐసీసీ రెండుసార్లు నిషేధం విధించింది.
బౌలింగ్ శైలిని పూర్తిస్థాయిలో మార్చుకుని 2015లో పునరాగమనం చేసినా పెద్దగా రాణించలేకపోయాడు. తన శైలి మీద నిషేధం విధించడం చాలా బాధకు గురి చేసిందని అప్పట్లో అజ్మల్ వాపోయాడు. పాక్ తరుపున 35 టెస్టులు ఆడిన అతడు 178 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 184 వికెట్లు, 64 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు.