దుబాయ్: ఇంగ్లాండుతో జరిగిన ట్వంటీ20 మ్యాచులో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ రికార్డు సృష్టించాడు. మూడు మ్యాచుల ట్వంటీ సిరీస్లో భాగంగా ఇంగ్లాండుతో శుక్రవారం రాత్రి జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో మూడు వికెట్లు తీసి ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లను తీసిన ఘనతను ఆఫ్రిదీ సాధించాడు.
ఇప్పటి వరకు 86 టీ20 మ్యాచులు ఆడిన ఆఫ్రిదీ 86 వికెట్లను తీసి అగ్రస్థానంలో నిలిచాడు, దీంతో మరో పాకిస్తాన్ క్రికెటర్ సయీద్ అజ్మల్ (85 వికెట్లు) సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జాసన్ రాయ్, ఆలెక్స్ హేల్స్, జేమ్స్ విన్స్ల వికెట్లను అతను తీశాడు.

కానీ, ఈ మ్యాచులో పాకిస్తాన్ మూడు పరుగుల తేడా ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లాండు మూడు టీ20 మ్యాచుల సిరీస్ను 2-0 సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. టాస్ గెలిచిన ఇంగ్లాండు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
ఇంగ్లాండు ఆటగాళ్లలో ఓపెనర్ రాయ్ (29), విన్స్ (38), రూట్ (20), బట్లర్ (33) కాస్తా ధాటిగానే బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 169 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పాకిస్తాన్ ఆటగాల్లలో అహ్మద్ షెహజాద్ (28), రఫ్తుల్లా మహ్మద్ (23), హఫీజ్ (25), షోయబ్ మాలిక్ (26), ఆఫ్రిదీ (24)లు ఓ మోస్తరుగా రాణించారు. తొలి మ్యాచును ఇంగ్లాండు 14 పరుగుల తేడాతో గెలుచుకుంది.