ఆసియా కప్ రైజింగ్ స్టార్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ షాహీన్స్ జట్టు శ్రీలంక-ఏ జట్టును 5 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 154 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. నవంబర్ 23న(ఆదివారం) ఫైనల్లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది.
చివరి ఓవర్లో శ్రీలంక ఓటమి
లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ లసిత్ క్రోస్పూలే 1.3 ఓవర్లలోనే 29 పరుగులు జోడించాడు. అయితే ఆ తర్వాత శ్రీలంకకు వరుసగా వికెట్ల రూపంలో ఎదురుదెబ్బలు తగిలాయి. చివరి వరకు పోరాడిన మిలన్ ప్రియనాథ్ రత్నాయకే 40 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. అయినప్పటికీ.. చివరి ఓవర్లో రత్నాయకేను అంపైర్ ఔట్ ఇవ్వడంతో శ్రీలంక జట్టు లక్ష్యం కన్నా 5 పరుగుల వెనుక ఉండిపోయింది.

పాకిస్థాన్ 154 పరుగులు
దానికి ముంద, పాకిస్థాన్-ఎ (షాహీన్స్) మొదట బ్యాటింగ్ చేసి శ్రీలంక-ఎ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో శ్రీలంక-ఎ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాకిస్థాన్-ఎ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ బ్యాటర్లు
పాకిస్థాన్ ఇన్నింగ్స్ తుఫానులా ప్రారంభమైంది. ఓపెనర్ మాజ్ సదాకత్ కేవలం 11 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. మహమ్మద్ నయీమ్ కూడా 16 పరుగులు చేశాడు. అయితే, 40 పరుగుల వద్ద మాజ్ ఔట్ అయిన తర్వాత, శ్రీలంక బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్ మిడిలార్డర్ తడబడింది. ఒకానొక సమయంలో జట్టు స్కోరు 62/5గా నమోదైంది. ఆ తర్వాత వికెట్ కీపర్-బ్యాటర్ అయిన గాజీ ఘోరీ ఒక వైపు స్థిరంగా ఆడి 36 బంతుల్లో నాటౌట్గా 39 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతనికి సాద్ మసూద్ (22 పరుగులు) నుంచి కీలక మద్దతు లభించింది. ఇన్నింగ్స్ చివర్లో అహ్మద్ డానియల్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్ల సహాయంతో మెరుపు వేగంతో 22 పరుగులు చేసి జట్టు స్కోరును 150 మార్కు దాటించాడు.
మదూశన్ 4 వికెట్లు
శ్రీలంక-ఎ తరఫున ఫాస్ట్ బౌలర్ ప్రమోద్ మదూశన్ అద్భుతంగా రాణించి అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే స్పిన్నర్ ట్రవీన్ మ్యాథ్యూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి పాకిస్థాన్ టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు.