
అబుధాబి: యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన మ్యాచ్ను ఆడనుంది. తన రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ ఆదివారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లు కూడా ఒక్కో పరాజయాన్ని అందుకున్నాయి.
ఈ నెల 24వ తేదీన ఇదే దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ను ఎదుర్కొన్న టీమిండియా.. పరాజయాన్ని చవి చూసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఇదే పాకిస్తాన్ జట్టు తన రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ను మట్టి కరిపించింది. మంగళవారం రాత్రి నాటి మ్యాచ్లో న్యూజిలాండ్పై అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది పాకిస్తాన్ టీమ్.
పాకిస్తాన్ చేతిలో పరాభవానికి గురైన భారత్-న్యూజిలాండ్ జట్లు ఫేస్ టు ఫేస్ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ముందుకు సాగాలంటే రెండు జట్లకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. బలమైన టీమిండియాను ఎదుర్కొనడానికి న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమౌతోంది. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన తరువాత- బ్లాక్ క్యాప్స్ ఇక తన తదుపరి మ్యాచ్లో భారత్పై గెలవడానికి కసరత్తు చేస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి- న్యూజిలాండ్పై మ్యాచ్ను గెలవడం ద్వారా తమదేశ జట్టు భారత్ను కాపాడినట్టయిందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ గెలిచి ఉంటే భారత్ అవకాశాలు మరింత క్లిష్టం అయ్యేవని చెప్పాడు. గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చెరో విజయాన్ని సాధించడం వల్ల మూడో జట్టుకు చోటు దక్కడం కష్టతరం అయ్యేదని అన్నాడు. పాకిస్తాన్..భారత్కు ఆ ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పాడు.
ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్లో తలో పరాజయాన్ని ఎదుర్కొన్నాయని, ఇప్పుడు ఏ జట్టు ముందుకు సాగుతుందనేది అవే తేల్చుకుంటాయని చెప్పుకొచ్చాడు. అందుకే- పాకిస్తాన్ ఎప్పుడూ కూడా భారత్ మేలు కోరుకుంటుందని అన్నాడు. ఓ మంచి పొరుగు వాడిగా ఉంటుందని చెప్పాడు. పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం వల్ల ప్రాణభయం ఉందని చెప్పుకొచ్చిన న్యూజిలాండ్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భద్రత ఉందా? అని ప్రశ్నించాడు. అది కూడా ముస్లిం దేశమే కదా? అని నిలదీశాడు.