షార్జా: అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ప్రకటించాడు. ఇంగ్లాండుపై మూడోది, చివరిదీ అయిన టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా అకస్మాత్తుగా ఆయన మంగళవారంనాడు ఆ ప్రకటన చేశాడు.
33 ఏళ్ల షోయబ్ మాలిక్ తన కెరీర్లో 35వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ముల్తాన్లో 2001లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచుతో ఆయన టెస్ట్ ఆరంగేట్రం చేశాడు. జెమ్స్ అండర్సన్ బౌలింగులో అతను మంగళవారంనాడు డకౌట్ అయ్యాడు. ఇది అతని చివరి ఇన్నింగ్స్ అయింది.
తమ వద్ద మంచి యువకులు ఉన్నారని, తాను తప్పుకోవడానికి ఇదే తగిన సమయమని మాలిక్ అన్నాడు. కుటుంబం తనకు మొదటిదని, 2019 ప్రపంచ కప్పై దృష్టి సారిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లాండుపై జరుగుతున్న టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో 38 పరుగులు చేశాడు.

బంతితో అతను 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్సులో పాకిస్తాన్ 234 పరుగులు చేయగా, ఇంగ్లాండు 306 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్సులో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
మూడో రోజు ఆట ముగిసిన వెంటనే షోయబ్ మాలిక్ షార్జా క్రికెట్ మైదానంలోకి మీడియా సమావేశానికి వచ్చి తన రిటైర్మెంట్ను ప్రకటించి మీడియాను ఆశ్చర్యానికి గురి చేశాడు.