
హైదరాబాద్: పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్కు బుధవారం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై అజ్మల్
సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే 2011 వరల్డ్ కప్లో తన బౌలింగ్లో సచిన్ ఔటైనా అంపైర్లు ఇవ్వలేదని ఆరోపించాడు.
'నా కెరీర్లో నాకిప్పటికీ అర్థం కాని విషయం ఒకటుంది. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్తో మేము తలపడ్డాం. ఆ మ్యాచ్ 37వ ఓవర్లో నా బౌలింగ్లో అఫ్రీదికి క్యాచ్ ఇచ్చి సచిన్ ఔటయ్యాడు. అయితే, అంతకముందే సచిన్ నా బౌలింగ్లో వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చాడు. అయితే అంఫైర్ ఔటివ్వలేదు. అలా ఎందుకు చేశారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ మ్యాచ్లో సచిన్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు' అని సయీద్ చెప్పాడు.
40 ఏళ్ల అజ్మల్ పాకిస్థాన్ తరఫున 35 టెస్టులు ఆడి 178 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 184 వికెట్లు, 64 టీ20ల్లో 85 వికెట్లు తీసుకున్నాడు. పాక్ తరుపున చివరిసారిగా 2014లో శ్రీలంకతో గల్లెలో జరిగిన టెస్టులో కనిపించాడు. అజ్మల్ బౌలింగ్ యాక్షన్పై మొదటి నుంచి వివాదం ఉన్న సంగతి తెలిసిందే.
2009లో ఆసీస్తో జరిగిన వన్డేలో అతని బౌలింగ్ శైలి (చకింగ్)పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత 2014లోనూ రెండోసారి మళ్లీ చకింగ్ చేస్తున్నాడని తేలడంతో ఐసీసీ రెండుసార్లు నిషేధం విధించింది. దీంతో బౌలింగ్ శైలిని పూర్తిస్థాయిలో మార్చుకుని 2015లో పునరాగమనం చేసినప్పటికీ.. గతంలో మాదిరి రాణించలేక జట్టులో చోటు కోల్పోయాడు.
దీంతో తన బౌలింగ్ యాక్షన్పై ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని, ఐసీసీవన్నీ చెత్త రూల్స్ అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బౌలర్లలో ఐసీసీ ప్రొటోకాల్ టెస్టులో 90 శాతం బౌలర్లు కచ్చితంగా ఫెయిలవుతారని అజ్మల్ తేల్చి చెప్పాడు. ఈ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు తన తరఫున కాస్త గట్టిగానే ఐసీసీతో పోరాడి ఉంటే తాను మరింత సంతృప్తిగా రిటైరై ఉండేవాడినని అజ్మల్ అన్నాడు.
'ఈ రోజు నేను రిటైరవుతున్నాను. ఇప్పుడు నాకు 40 ఏళ్లు. కాబట్టి నేను తప్పుకొని యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనుకుంటున్నాను. ఎంతో అసంతృప్తితో రిటైరవుతున్నా. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ. నా బౌలింగ్ శైలి సరిగా లేదంటూ నాపై రెండుసార్లు నిషేధం విధించింది. ఈ సందర్భంగా నేను ఐసీసీకి ఒక సవాల్ విసురుతున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న బౌలర్లకు ఒకసారి పరీక్ష నిర్వహించండి. అందులో 90శాతం మంది ఫెయిలవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని అజ్మల్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.