ఏ ఫార్మాట్లో అయినా సరే విజయం తెచ్చే మజానే వేరు. అదే ఏడాదిగా ఒక ఫార్మాట్లో రుచి చూడని విజయం ఎట్టకేలకు దక్కితే? అదే మజాను ప్రస్తుతం పాకిస్తాన్ టీం అనుభవిస్తోంది. ఇటీవలి కాలంలో వన్డేలు, టీ20ల్లో బలమైన జట్టుగా ఎదిగిన పాకిస్తాన్.. పాల్గొన్న ప్రతి టోర్నీలో ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. కానీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో మాత్రం చాలా పేలవ ప్రదర్శన చేసింది.
గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. మహా అయితే మ్యాచులు డ్రా చేసుకోగలిగిందే కానీ.. ఒక్క టెస్టు విజయం రుచిచూడలేదు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన టెస్టులో పాకిస్తాన్ అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఏడాది తర్వాత దక్కిన ఈ టెస్టు విజయంతో పాక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అంతేకాదు, కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో తొలి విజయం సాధించిన పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో భారత్ సరసన చేరింది. ఈ సైకిల్లో ఆడిన తొలి మ్యాచ్లో భారత్ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు జట్లు 100 శాతం పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకుంటుననాయి. ఆ తర్వాతి స్థానంలో 61.11 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా ఉంది.
ఈ టెస్టు మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 312 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా పాకిస్తాన్ 461 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో పాక్ ప్లేయర్ సౌద్ షకీల్ ఏకంగా 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 279 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్ ముందు 131 పరుగులు టార్గెట్ నిలిచింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కొంత తడబడినప్పటికీ.. ఇమామ్ ఉల్ హక్ (50 నాటౌట్), సౌద్ షకీల్ (30) పోరాడి పాకిస్తాన్కు విజయాన్ని అందించారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూరియ నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్తాన్ గెలవడం కష్టంగా కనిపించింది. అయితే ఇమామ్ ఉల్ హక్, షకీల్, బాబర్ ఆజమ్ (24) తలో చెయ్యి వేయడంతో పాక్ జట్టు.. 32.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ విజయంతో పాక్ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం గాలే వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపైనే పాకిస్తాన్ తమ చివరి టెస్టు విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. మళ్లీ ఇప్పుడు అదే వేదికపై అదే టీంపై గెలిచింది. దీంతో రెండు టెస్టుల సిరీసులో 1-0 ఆధిక్యం సాధించింది.