టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్థాన్ క్రికెట్ అవమానించింది. అతడిని అనుకరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అలానే అతడిని బాడీ షేమింగ్ కూడా చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. దీంతో క్రికెట్ అభిమానులంతా పాకిస్థాన్ పై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం..
మస్కట్ వీడియోలో బాడీ షేమింగ్..
ఐపీఎల్కు పోటీగా పాకిస్థాన్ పీఎస్ఎల్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్.. రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ తో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో లీగ్ మస్కట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. దానికే రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను జత చేశారు. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ మాట్లాడిన వ్యాఖ్యలను.. తాజా మస్కట్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్లో ప్లే చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారత క్రికెట్ అభిమానులంతా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మీకో న్యాయం.. మాకో న్యాయమా..
అంతకుముందు పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీష్ మాట్లాడిన తీరును అనుకరిస్తూ... ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కాస్త హాస్యాస్పదంగా మాట్లాడాడు. దీంతో తమ కెప్టెన్ ను ఇలా అవమానిస్తారా? అంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు పాకిస్థానే.. అవతలి జట్టు సారథిని అవమానిస్తే మాత్రం సైలెంటుగా ఉండటాన్ని భారత క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
వీడియో తీసేయాల్సిందే..
ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య. ఓ సక్సెస్ ఫుల్ కెప్టెన్ పై బాడీ షేమింగ్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను తీసేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు.
