పాకిస్థాన్ & ఫీల్డింగ్.. ఈ రెండింటి అనుబంధానికి ఎప్పటికి ముగింపు ఉండదు. ప్రాక్టీస్లో మెరుగవ్వాలని తాతల తరాల నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ పాక్ జట్టులో ఎలాంటి మార్పు లభించలేదు. అదే చెత్త ఫీల్డింగ్! క్యాచ్ కోసం ఇద్దరు ప్లేయర్లు దగ్గరగా వచ్చి ఎవరూ అందుకోకపోవడం, సింగిల్ను డబుల్స్గా, డబుల్స్ను బౌండరీగా మార్చడం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రాక్టీస్లో అనూహ్య మార్పు తీసుకురావాలని టీ20 వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది.
ఆటగాళ్లలో ఫిట్నెస్ ప్రమాణాలు పెంచితే, మైదానంలో మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తారని భావించింది. దాని కోసం పాక్ ఆటగాళ్లకు ఏకంగా ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. అదేమైనా సక్సెస్ అయ్యిందా అంటే? అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో టీ20 ప్రపంచకప్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దీంతో ఐసీసీ ట్రోఫీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీర్ఘకాలిక ప్రణాళికలు వేసింది. తమ స్వదేశంలో జరిగే ఐసీసీ ట్రోఫీని గెలవాలని ప్లాన్స్ మొదలుపెట్టింది.

ముందుగా తమ ప్రధాన బలహీనత ఫీల్డింగ్ను బలంగా మార్చాలనుకుంది. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఏంటంటే.. ప్రాక్టీస్ పరుపులపై చేస్తోంది. మైదానంలో విశాలంగా పరుపులను పరిచి దానిపై డైవ్ చేస్తూ పాక్ ప్లేయర్లు సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అయితే దీని వల్ల ప్రయోజనమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవికతకు దూరంగా చేసే ఈ సాధనతో లాభం ఉండదని, మరోసారి పాకిస్థాన్ ఉపయోగం లేని ప్రాక్టీస్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. పరుపులతో పాటు దుప్పట్లు కూడా తెచ్చుకోవాల్సిందని మరికొందరు పాక్ ప్లేయర్లను ట్రోల్ చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. లాహోర్ వేదికగా మార్చి 1న భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.