
గతేడాది టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు పెద్దగా ఆకట్టుకోలేదు. సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరమైన ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఆ టోర్నమెంట్ మొత్తంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ హైలైట్గా నిలిచింది. జట్టు కష్టాల్లో ఉండగా ఛేజింగ్ ప్రారంభించిన టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి, చివరి బంతికి జట్టును గెలిపించాడు.
ఆ మ్యాచ్లో చివరి 8 బంతుల్లో 28 పరుగులు అవసరం ఉన్న సమయంలో.. పాక్ స్టార్ పేసర్ హారీస్ రవూఫ్ బౌలింగ్ చేశాడు.19వ ఓవర్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయతే ఆ ఓవర్ చివరి రెండు బంతులకు కోహ్లీ రెండు భారీ సిక్సర్లు బాదాడు. వాటిలో మొదటి సిక్స్ ఒక లెంగ్త్ బాల్పై బాదాడు. రవూఫ్ బంతి వేయగానే కొంత రూమ్ తీసుకున్న కోహ్లీ.. బౌలర్ తలమీదుగా బంతిని భారీ సిక్సర్కు పంపాడు. ఇది చూసిన రవూఫ్తోపాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్, ఆ జట్టు అభిమానులు నోరెళ్లబెట్టారు.
తాజాా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి రవూఫ్ మాట్లాడాడు. కోహ్లీ కొట్టిన ఆ షాట్ చూసి ఎలా ఫీలయ్యారు? అని అభిమానులు అడగ్గా.. మ్యాచ్లో చూపించలేదు కానీ, ఆ షాట్ తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని చెప్పాడు. అయితే కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసునని, ముఖ్యంగా ఆ షాట్లో అతనికి టైమింగ్ కూడా సరిగ్గా కలిసొచ్చిందని చెప్పాడు.
అదే షాట్ను మళ్లీ మళ్లీ ఆడటం కోహ్లీ వల్ల కూడా కాదని తేల్చిచెప్పాడు. అదొక అరుదైన క్షణమని, అలాంటి సమయంలో ఆ సిక్సర్ వెళ్లడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు. ఆ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి ఓవర్లో కూడా బలమైన షాట్లు ఆడాడు. చివరి బంతికి అశ్విన్ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.