ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) జట్ల వన్డే ర్యాంకింగ్స్ను అప్డేట్ చేసింది. ఇక తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. పాకిస్థాన్ జట్టు ఇండియాను అధిగమించి 4వ ర్యాంకుకు చేరుకుంది. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లో 3-0తేడాతో పాక్ గెలుపొందింది. ఇక బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ మధ్య అద్భుతంగా ఆడుతుంది. ఈ సిరీస్కు ముందు పాకిస్థాన్ 102రేటింగ్ పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్పై 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాక్ 106రేటింగ్ పాయింట్లు పొంది 4వ ర్యాంకుకు చేరుకుంది. ఇక 105రేటింగ్ పాయింట్లతో భారత్ 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. ఇక తొలి స్థానంలో న్యూజిలాండ్, రెండో స్థానంలో ఇంగ్లాండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. ఇక 6వ స్థానంలో సౌతాఫ్రికా, 7వ స్థానంలో బంగ్లాదేశ్, 8వ స్థానంలో శ్రీలంక, 9వ స్థానంలో వెస్టిండీస్, 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.
ఇకపోతే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో 3-0తేడాతో గెలుపొందింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో 0-3తో దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్లో ఓడిపోయింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్లో బరిలోకి దిగగా.. అతని కెప్టెన్సీలో మొత్తం 4 వన్డే మ్యాచ్లు ఇండియా ఓడిపోయింది. ఒక టెస్ట్లో కూడా భారత్ ఓడిపోయింది. ఇక 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 0-7తేడాతో దక్షిణాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇక స్వదేశంలో ప్రోటీస్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 0-2తేడాతో వెనకబడి ఉంది.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డేలలో అత్యద్భుత ప్రదర్శన చేస్తుండడంతో పాక్ జైత్రయాత్ర కొనసాగుతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన పాక్ వెస్టిండీస్ను 3-0తో ఓడించింది. 2022లో పాకిస్థాన్ వన్డేల్లో 5-1తేడాతో తన గెలుపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక వెస్టిండీస్తో జరిగిన మొదటి మ్యాచ్లో అతని ఇటీవల సెంచరీతో చెలరేగడంతో అతను వరుసగా మూడు వన్డే సెంచరీలు రెండుసార్లు సాధించిన తొలి బ్యాటర్గా నిలిచాడు. గతంలో 2016లో కూడా ఈ ఘనతను బాబర్ అజామ్ సాధించాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన బాబర్ అజామ్.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో వరుసగా అత్యధికంగా 9సార్లు 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. ఇక ఆగస్టులో పాకిస్థాన్ తమ తదుపరి వన్డే సిరీస్ను ఆడనుంది.