న్యూజిల్యాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. కీలకమైన ప్లేయర్లు లేకపోవడంతో కివీస్ జట్టు పాక్ ముందు నిలవలేకపోయింది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. ఈ విజయాలతో వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా పాక్ నిలిచింది. ఈ ర్యాంక్ రాగానే పాక్ అభిమానులు చెలరేగిపోయారు.
మిగతా జట్లను, ముఖ్యంగా భారత్ను తెగ ట్రోల్ చేశారు. అయితే చివరి వన్డేలో కూడా నెగ్గితేనే ఈ ర్యాంకును నిలుపుకునే అవకాశం పాక్కు ఉంది. ఈ మ్యాచ్లో కివీస్ కుర్రాళ్లు అనూహ్యంగా పుంజుకొని పాక్ను ఓడించారు. అనుభవం లేని కివీస్ జట్టు చేతిలో 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.

ఈ ఓటమితో పాకిస్తాన్ వన్డే రేటింగ్ పాయింట్లు 112కు పడిపోయాయి. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఈ జట్టు అగ్రస్థానాన్ని 48 గంటల్లోనే కోల్పోయింది. టాప్ టీమ్స్ కన్నా తామే గొప్ప అని చెప్పుకున్న ఆ టీం ఫ్యాన్స్ ఆనందం ఆవిరైంది. చెరో 113 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాలను తిరిగి ఆక్రమించాయి.
పాకిస్తాన్ 112 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. అయితే పాకిస్తాన్ వేదికగా జరిగిన న్యూజిల్యాండ్ సిరీస్ను మాత్రం 4-1 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది బాబర్ సేన. ఈ సిరీస్లో చక్కగా రాణించిన బాబర్ ఆజమ్ కూడా అరుదైన రికార్డు సాధించాడు. 100 వన్డేల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వంద వన్డేలు ఆడిన తర్వాత బాబర్ ఆజమ్ ఏకంగా 5089 పరుగులతో నిలిచాడు. ఈ క్రమంలో వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ, హషీమ్ ఆమ్లా వంటి హేమాహేమీల రికార్డులను కూడా బాబర్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విషయం చూపించి పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న పాకిస్తాన్.. ఆసియా కప్, వరల్డ్ కప్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.