
ఆసియా కప్ను పాకిస్తాన్ నుంచి మార్చడమే మంచిదని ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. అయితే ఐసీసీలో బీసీసీఐ ప్రాబల్యం పెరగడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాము పాకిస్తాన్ వెళ్లడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ విషయంలో తమకు భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ దొరకదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం బాగలేవని, ఈ కారణంగా తమకు క్లియరెన్స్ దొరకదని చెప్పింది.
ఈ సమావేశంలో ఆసియా కప్ వేదిక మార్చడంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో మార్చి నెలలో మరోసారి సమావేశమైన ఆసియా కప్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. ఆసియా కప్ పాకిస్తాన్లో జరగదని రజాక్ తేల్చేశాడు. అంతకుముందు మరో పాక్ మాజీ ఆటగాడు జావెద్ మియాందాద్.. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ రాకపోతే ఏమైందని, మా క్రికెట్ మాకుంటుందని అంటూ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు. భారత్ కనుక పాకిస్తాన్ రాకుంటే.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ వెళ్లకూడదంటూ మండిపడ్డాడు.
అయితే దీనికి భిన్నంగా స్పందించిన రజాక్.. 'క్రికెట్కు, క్రికెట్ ప్రచారానికి ఆసియా కప్ వేదిక మార్చడమే మంచిది. భారత్, పాకిస్తాన్ మ్యాచులు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే జరుగుతాయి. ఆసియా కప్ను దుబాయ్కు మార్చడం మంచి ఆప్షన్. ఆటకు, ఆటగాళ్లకు ఇదే మంచిది. ఇలా చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఈ రెండు బోర్డులు ఒకచోటు కూర్చొని సమస్యలపై చర్చించుకుంటే మంచిది. ఈ సమస్యను రెండు బోర్డులు పరిష్కరించుకోవాలి' అని రజాక్ అన్నాడు. కానీ ఐసీసీలో బీసీసీఐ ప్రాబల్యం ఇంత పెరగడం మంచిది కాదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.