Pakistan: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో చోటు చేసుకున్న సంఘటనలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)ని ఆశ్చర్యపరిచాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో తలపడాల్సి వస్తే అది ఫైనల్ అయినా సరే అదే నిర్ణయాన్ని తీసుకుంటామని భారత రిటైర్డు ప్లేయర్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుటి నుంచి ప్రైవేట్ మ్యాచ్లకు 'పాకిస్థాన్ ' పేరు వాడకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్లను మినహాయించి ఆడబోయే ప్రతి ప్రైవేట్ లీగ్ మ్యాచ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బోర్డు నిర్ణయం పట్ల ఆ దేశ రిటైర్డ్ ప్లేయర్లు షాక్కు గురయ్యారు. దేశం గుర్తింపు లేకుండా ఎవరి కోసం ఆడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
WCLలో భారత్ నిరాకరణ.. పాకిస్థాన్కు నిరాశ
టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఛాంఫియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ జట్టు, షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుతో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది. లీగ్ దశలో ఒకసారి, ఆ తర్వాత సెమీ-ఫైనల్లో కూడా భారత్ పాకిస్థాన్తో ఆడటానికి నిరాకరించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానెళ్లలో హాట్ టాపిక్గా మారింది. దీనిని భారత్, పాకిస్థాన్ మధ్య ఒక కొత్త ఘర్షణగా అభివర్ణించారు. భారత జట్టు పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఆడటానికి నిరాకరించడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ రకమైన ప్రకటనలు బయటకు రాగానే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నత స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా పీసీబీ ప్రైవేట్ క్రికెట్ లీగ్లలో దేశం పేరును ఉపయోగించడాన్ని నిషేధించాలని ఒక వింత ఆదేశాన్ని జారీ చేసింది.

టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం.. పీసీబీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ విషయంపై విస్తృతంగా చర్చించారు. "డబ్ల్యూసీఎల్ రెండో సీజన్లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్కు వ్యతిరేకంగా రెండుసార్లు ఆడటానికి నిరాకరించడం వల్ల దేశ క్రికెట్ జట్టుకు, దాని ప్రజాదరణకు తీవ్ర నష్టం వాటిల్లింది" అని ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్ క్రికెట్ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఏ ప్రైవేట్ సంస్థకూ ప్రైవేట్ లీగ్ కోసం దేశం పేరును ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం డబ్ల్యూసీఎల్ లో ఉన్న పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు మాత్రం శనివారం దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా జరిగే ఫైనల్లో ఆడటానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.