
గతేడాది మాదిరిగానే పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్.. టీ20 ప్రపంచకప్ మాథ్యూ హేడెన్ను సహాయక సిబ్బందిగా నియమించుకుంది. గత సంవత్సరం హేడెన్ పాక్ తరఫున పని చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా జట్టు మెంటార్గా చేరనున్నాడు. ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతరులతో కలిసి మెంటార్ బాధ్యతలను హేడెన్ పోషించనున్నాడు. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో క్రికెటర్ అయిన హేడెన్.. బ్రిస్బేన్లో అక్టోబర్ 15న పాకిస్థాన్ జట్టుతో చేరనున్నాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్నందున.. పాకిస్థాన్ జట్టుకు హేడెన్ సహకారం కాస్త సానుకూలాంశంగా మారనుంది. గత టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో సెమీఫైనల్లో నాటకీయ పరిస్థితుల్లో ఓడిపోయింది. ఈ ఏడాది పాకిస్థాన్ జట్టు మంచి ఫామ్లో ఉంది. దీంతో రెండో టీ20వరల్డ్కప్ గెలవాలనే కసితో ఆ జట్టు ఉంది.
ఆసియాకప్లో ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంక వర్సెస్ పాక్ తలపడనున్నాయి. ఇకపోతే ఆస్ట్రేలియా పరిస్థితులు బాగా తెలిసిన హేడెన్ తన ఎంపిక పట్ల మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం నేను పాకిస్థాన్ జట్టుకు మెంటార్గా పనిచేయనున్నాను. మళ్లీ పాకిస్థాన్ జట్టుతో చేరడానికి ఎదురుచూస్తున్నాను. వన్ నేషన్ వన్ ప్యాషన్ స్ఫూర్తిని పొందేందుకు రెడీ అయ్యాను' అని హేడెన్ చెప్పాడు.
'ఏసీసీ టీ20 ఆసియాకప్లో పాకిస్తాన్ ఎలా ప్రదర్శన ఇస్తుందో నేను చూశాను. ఆదివారం భారత్పై పాక్ అధ్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో రాణించడానికి పాకిస్తాన్ జట్టుకు ఏమి అవసరమో దాన్ని నేను అందించగలనని నేను భావిస్తున్నాను. ఆసీస్ పరిస్థితులు పాక్ జట్టుకు సరిగ్గా సరిపోతాయి. పాక్ బ్యాటింగ్, బౌలింగ్ దృక్పథం ప్రస్తుత బాగుంది. గతేడాది యూఏఈలో సత్తా చాటినట్లుగానే ఈసారి కూడా పాక్ ప్రపంచకప్లో మెరుగ్గా రాణిస్తుందని అనుకుంటున్నాను. నాకు మరోసారి పాక్ తరఫున పని చేసే అవకాశం లభించడాన్ని విశేషంగా భావిస్తున్నాను.' అని హేడెన్ చెప్పాడు.