టీమిండియా అన్న, టీమిండియా ఆటగాళ్లు అన్న పాకిస్థాన్ ఆటగాళ్లు నిత్యం అక్కసు వెళ్లగక్కుతుంటారు. టీమిండియాపై లేని ఆరోపణలు చేస్తుంటారు. అవాస్తవమైన వ్యాఖ్యలతో నిందిస్తుంటారు. టీమిండియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పాకిస్థాన్ ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది. తాజాగా మరోసారి అదే జరిగింది. పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా భారత ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విభజించబడిందని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కనిపించినట్టు చెప్పాడు. తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ వేర్వేరుగా కూర్చునున్నారని తెలిపాడు. దీనిని బట్టి టీమిండియాలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వేర్వేరు గ్రూపులుగా ఉంటున్నారని అర్థం అవుతుందన్నాడు. అలాగే కోహ్లీలో కెప్టెన్గా ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం, ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పాడు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ టీమ్ మ్యాన్ అని, మరింత బలంగా తిరిగి వస్తాడని కనేరియా అన్నాడు.
ఇటీవల విరాట్ కోహ్లీ టీమిండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో పరిమిత ఓవర్లకు ఇప్పటికే రోహిత్శర్మను బీసీసీఐ కెప్టెన్గా ప్రకటించింది. అయితే టెస్టు ఫార్మాట్కు మాత్రం ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. టెస్టు కెప్టెన్సీ కూడా రోహిత్శర్మకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రోహిత్కు రాహుల్, పంత్ నుంచి పోటీ ఉంది. దీనికి తోడు వయసు ఎక్కువ అవడం కూడా రోహిత్ శర్మకు మైనస్గా మారింది. అయితే గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరగుతున్న వన్డే సిరీస్లో రోహిత్ శర్మ స్థానంలో లోకేష్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
తొలి వన్డేలో ఓటమి పాలైన భారత్.. రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాహుల్ సేన 20 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో 41 పరుగులతో రాహుల్, 27 పరుగులతో పంత్ ఉన్నారు. మరో ఓపెనర్ ధావన్ 29 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కాగా తొలి వన్డే మ్యాచ్లో బరిలోకి దిగిన భారత జట్టే రెండో వన్డేలోనూ బరిలోకి దిగింది. సిరీస్ కోల్పోకూడదంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవాల్సిందే. సౌతాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.