వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, టీమిండియా పాకిస్థాన్కు వెళ్లదని ఐసీసీకి బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత్ తమ దేశానికి రావాలని ఐసీసీని పాక్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తోంది.
మరోవైపు ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఎన్నిక కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్థాన్ వైట్ బాల్ టీమ్స్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న మహ్మద్ రిజ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి టీమిండియా రావాలని రిజ్వాన్ అభ్యర్థించాడు. ఘన స్వాగతం పలుకుతామని, చక్కని ఆతిథ్యం ఇస్తామని తెలిపాడు. భారత ఆటగాళ్లను పాకిస్థాన్ అభిమానులు ఎంతో ప్రేమిస్తారని, వాళ్ల కోసం అయినా రావాలని కోరాడు.

''టీమిండియా ప్లేయర్లను పాకిస్థాన్ అభిమానులు ఎంతో ప్రేమిస్తారు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత్లో కూడా మేం ఇలాంటి ప్రేమనే పొందాం. అభిమానులే కాకుండా మేం కూడా భారత్ను కోరుతున్నాం. మా దేశానికి వచ్చి ఆడండి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా వస్తుందా లేదా అనే విషయంపై నాకు స్పష్టత లేదు. అయితే ఒక్కటి మాత్రం జరుగుతుంది. ఇక్కడ భారత్కు అపూరమైన ఘన స్వాగతం దక్కుతుంది'' అని మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు.
షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియాలను పీసీబీ ఆధునీకరిస్తోంది. దీని కోసం 12.80 బిలియన్ల రూపాయలను వెచ్చించనుంచి. కాగా, బాబర్ అజామ్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ ఇటీవల వన్డే, టీ20లకు సారథి బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.
2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం పాకిస్థాన్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాలుగో కెప్టెన్. 2023 వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ బాబార్ అజామ్ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ అఫ్రిది జట్టు పగ్గాలు అందుకున్నారు. టెస్టు ఫార్మాట్కు కెప్టెన్గా షాన్ మసూద్ కొనసాగుతున్నాడు. కానీ, ఒక్క టీ20 సిరీస్తోనే షాహిన్ అఫ్రిదిని తొలగించారు. తిరిగి బాబర్ అజామ్ను వైట్ బాల్ ఫార్మాట్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20 వరల్డ్ కప్ అనంతరం వైట్ బాల్ కెప్టెన్సీకి బాబర్ అజామ్ గుడ్బై చెప్పాడు.