
దుబాయి: భారత్-పాక్ పోరంటే ఎప్పుడూ ఉత్కంఠే. ఎటువంటి ఫార్మాట్ అయినా అదే స్థాయి ఆసక్తి. దాయాది జట్ల మధ్య మ్యాచ్కు టీవీలకు అతుక్కుపోయే వాళ్లు కొందరైతే స్టేడియంలో పేరుకుపోయేవాళ్లు ఇంకొందరు. కొద్ది రోజుల ముందే ఇరు జట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్ ముగిసింది. ఈ వన్డే మ్యాచ్లో పాక్పై గెలిచి టీమిండియా సూపర్-4 రేసులో నిలిచింది. ఆ తర్వాత అఫ్గాన్తో ఆడిన పాక్ ఎట్టకేలకు సూపర్-4లొ తానూ అడుగుపెట్టేందుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన భారత్-పాక్ల మధ్య మ్యాచ్లో భారతీయులతో పాటుగా జాతీయగీతం ఆలపించిన పాక్ దేశస్థుడు.. సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయిపోయాడు.
ఇంతటితో ఆగకుండా భారత్-పాక్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్లో కూడా అలానే స్పందించనున్నానంటూ మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. ఈ సారి ఇరు దేశాల జాతీయ జెండాలను రెండు చేతులతో పట్టుకుని మ్యాచ్కు రానున్నాడట. అసలు ఆదిల్ తాజ్ అనే వ్యక్తి ఇలా జాతీయ గీతం ఎందుకు ఆలపించాడనే ప్రశ్నకు అతనే చెప్పిన సమాధానం ఏంటంటే, 'అంతకుముందు పాకిస్థాన్ జాతీయ గీతం వినిపించినప్పుడు స్టేడియంలో ఉన్న భారతీయులు లేచి నిలబడి చప్పట్ల ద్వారా గౌరవాన్ని తెలియజేశారు.'
ఆ తర్వాత భారత జాతీయ గీతం రావడంతో తాను కూడా ఇలా స్పందించాననే విషయాన్ని చెప్పాడు. ఇది కేవలం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రక్రియ కానీ, మరేదీ కాదని తన ఉద్దేశ్యాన్ని తెలియజేశాడు. మంగళవారం ఆసియా కప్లో మొదటి మ్యాచ్ను హాంకాంగ్పై 26 పరుగుల ఆధిక్యంతో శుభారంభాన్ని నమోదు చేసింది. ఇక ఆ తర్వాతి మ్యాచ్ను పాకిస్తాన్తో తలపడిన టీమిండియా.. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 4కు అర్హత సాధించింది.
ఆదివారం పాక్తో తలపడనున్న భారత్ భీకరమైన ఫామ్లో కనిపిస్తోంది. పాకిస్తాన్ మాత్రం టోర్నీలో మ్యాచ్ గెలిచేందుకు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. కానీ, భారత్-పాక్ మ్యాచ్ అంటే పరిస్థితులను ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే ఇదే టోర్నీలో దాయాది జట్ల మధ్య రెండో సారి జరగనున్న మ్యాచ్పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.