పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. సైఫర్ కేసుకు సంబంధించి రావల్పిండిలోని ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్తో పాటు మాజీ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషికి కూడా పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో పది రోజుల్లో పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం సంచలనంగా మారింది.
అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం పంపిన ఒక రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారన్న అభియోగాన్ని సైఫర్ కేసుగా పిలుస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గి పదవి కోల్పోయే ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభలో ఓ పత్రాన్ని చూపించారు. తన పదవి కోల్పోవడానికి అమెరికా కుట్ర చేస్తోందని దాన్ని చూపిస్తూ ఆరోపించారు.

వాటిని అమెరికాలో పాక్ రాయబార కార్యలయం నుంచి సేకరించినట్లు చెప్పారు. దీంతో అఫీషియల్ సీక్రెట్స్ యాక్టును ఉల్లంఘించారనే అభియోగాలతో ఆయనతోపాటు మహమ్మద్ ఖురేషీలపై కేసు నమోదయ్యింది. ప్రత్యేక న్యాయస్థానం దీనిపై విచారంచి ఇవాళ తీర్పు వెలువరించింది. ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు పీటీఐ ఈ కేసును ఉన్నత న్యాయస్థానంలో అపీలు చేస్తామని ప్రకటించింది. కాగా, ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఇది హై సెక్యూరిటీ కారాగారం.
కాగా, పాకిస్థాన్కు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్గా ఇమ్రాన్ ఖాన్ చరిత్రలో నిలిచాడు. 1992లో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. మరోవైపు పీటీఐ పార్టీ తరఫున 2018 ఆగస్టులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. కానీ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 2022 ఏప్రిల్లో పదవి కోల్పోయాడు.