పాక్ క్రికెట్లో పెను భూకంపం సంభవించింది. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు పాక్ సెలెక్టర్లు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్కు సన్నాహకంగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో పాక్ దిగ్గజ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రీది, మహ్మద్ రిజ్వాన్, హారిస్ రౌఫ్ వంటి స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీలను పక్కన పెట్టడం ద్వారా సెలెక్టర్లు గట్టి సంకేతాలిచ్చారు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత స్పిన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలో ఈ యువ జట్టు శ్రీలంకతో తలపడనుంది. అన్క్యాప్డ్ వికెట్ కీపర్ ఖ్వాజా నఫాయ్కు తొలిసారి విదేశీ సిరీస్లో అవకాశం లభించింది.

వరల్డ్ కప్ 2026 సమీకరణాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ తన మ్యాచ్లను కేవలం శ్రీలంకలోనే ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. గ్రూప్-ఎ లో భారత్, పాకిస్థాన్లతో పాటు నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లు ఉన్నాయి.
శ్రీలంక సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా నఫాయ్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, మహమ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.