హైదరాబాద్: ఐపీఎల్ మాదిరే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీబీఎల్) కూడా వివాదాల మయమవుతోంది. నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు యువతులను హోటల్ గదుల్లోకి పిలిపించుకున్న ఘటన మరువకముందే తాజాగా అలానే మరో ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు తన హోటల్ గదికి యువతిని పిలిపించుకొని అడ్డంగా దొరికిపోయాడట. దీంతో అతడిని అధికారులు గట్టిగా మందలించినట్టు స్పోర్ట్స్కీడ అనే వెబ్సైట్ వెల్లడించింది.
పాకిస్థాన్ జట్టులో ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్న సదరు క్రికెటర్ పేరుని మాత్రం అధికారులు వెల్లడించలేదు. అంతేకాదు ఆ క్రికెటర్ హోటల్కు పిలిపించుకున్న ఆ విదేశీ మహిళ నిరోధక శాఖ అధికారుల జాబితాలో ఉందని, దీంతో అతన్ని అధికారులు గట్టిగా మందలించినట్టు తెలుస్తోంది.
అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ యువతులను హోటల్ గదులకు పిలిపించుకోవడం లాంటి చర్యలకు పాల్పడవద్దని బీపీఎల్ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. పాకిస్ధాన్ జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న అతడి ప్రవర్తనపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐపీఎల్ మాదిరి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సుమారు 18 మంది పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఇటీవలే యువతులను తమ హోటల్ గదులకు ఆహ్వానించి నిబంధనలను ఉల్లంఘించిన బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్లు షబ్బీర్ రహ్మాన్, ఆల్ అమిన్ హుస్సేన్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది.
ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్టు అధికారిక ప్రకటన చేసింది. ఐసీసీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లఘించి పెద్ద తప్పు చేశారని, మరోసారి ఇలాంటివి జరిగితే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గతంలో బంగ్లా బోర్డు ఇంత పెద్ద మొత్తంలో భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఎడిషన్లో ఏడు ప్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. బీపీఎల్లో పాకిస్ధాన్కు చెందిన షాహిద్ అప్రిదీ, వెస్టింగ్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు.