
బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా తన రికార్డును తానే బద్దలుకొట్టింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అరుదైన ఘనతను సాధించింది. సోమవారం కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టీండీస్పై గెలుపొందడం ద్వారా పాకిస్థాన్ ఈ మైలురాయిని చేరుకుంది. కాగా పాకిస్థాన్ టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది అత్యధికంగా 18 మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం. ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక జట్టుకు ఇవే అత్యధిక విజయాలు.
అయితే గతంలో కూడా ఈ రికార్డు పాకిస్థాన్ పేరు మీదనే ఉండేది. 2018లో కూడా పాకిస్థాన్ అచ్చం ఇదే రికార్డును సాధించింది. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని అప్పటి పాక్ జట్టు 2018లో 17 విజయాలు సాధించింది. కాగా పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల రికార్డు భారత్ పేరు మీదనే ఉంది. 2016లో టీమిండియా 15 విజయాలు సాధించింది. ఇక పాకిస్థాన్, భారత్ తర్వాత మూడో స్థానంలో పపువా న్యూగినియా జట్టు ఉంది. ఈ జట్టు 2019లో 14 టీ20 మ్యాచ్ల్లో నెగ్గింది.
కాగా సోమవారం కరాచీ వేదికగా పాకిస్థాన్, వెస్టీండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. విండీస్ను 63 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 10 ఫోర్ల సాయంతో 52 బంతుల్లో 78 పరుగులు చేశాడు. హైదర్ అలీ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివర్లో నవాజ్ 3 ఫోర్లు, 2 సిక్స్లతో 10 బంతుల్లోనే అజేయంగా 30 పరుగులు చేశాడు. వెస్టీండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో స్మిత్, థామస్, అకేల్ హోసేన్, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ తీశారు. అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ పాక్ బౌలర్ల దాటికి 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో హోప్ ఒక్కడే 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతావారెవరూ పెదగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లతో చెలరేగారు. మిగతావారిలో ఆఫ్రిదీ, రఫ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 అధిక్యంలో నిలిచింది. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగనుంది.