
హైదరాబాద్: కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను గెలిచిన టీమిండియాపై ప్రశంసలు వర్షం కురుస్తూనే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు భారత జట్టును కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కీలక ఆటగాళ్ల లేకున్నా.. యువ క్రికెటర్లు 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు గబ్బాలో ఓటమి రుచి చూపించిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, చేటేశ్వర్ పుజారా, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ల ప్రదర్శన అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
అయితే పాకిస్తాన్ ఫాన్స్ సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం ఇక్కడ విశేషం. అజింక్య రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ కామెంట్లు చేశారు. 'వాటే సిరీస్.. ఇది చారిత్రాత్మక విజయం. టీమిండియాకు శుభాకాంక్షలు. భారత ఆటగాళ్లు చూపిన పట్టుదల అమోఘం. భారత జట్టు నేడు వారి క్లాస్ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి. పాకిస్తాన్ నుంచి మీకు అభినందనలు' అని ఫాతిమా ఖలీల్ బట్ ట్వీట్ చేశారు.
'ఇంతటి ఘన విజయం. రిషభ్ పంత్ ఆట అద్భుతం. భారత జట్టు లాగే పాకిస్తాన్ కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం' అని మాలిక్ రెహమాన్ ఆకాంక్షించారు. 'కీలక ఆటగాళ్లు లేరు కాబట్టి ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతుందని అంతా భావించారు. కానీ మీరు మాత్రం అద్భుత పోరాటపటిమ కనబరిచి మీ అభిమానుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. శుభాకాంక్షలు' అని మరొకరు ట్వీట్ చేశారు.
ఇక ఆఖరి టెస్టులో భారత్ను విజయతీరాలకు చేర్చిన యువ ఆటగాళ్లపై మాజీలు, నెటిజన్లు తమదైన రీతిలో సరదా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోని ఆసీస్ మండిపోతోందంటూ.. ప్యాంటు కాలిపోతున్న చిత్రంతో భారత మాజీ ఆటగాడు వసిమ్ జాఫర్ ట్రోల్ చేశాడు. ఇటీవల వచ్చిన 'మాస్టర్' సినిమాలో హీరో ఎలివేషన్ సన్నివేశాన్ని పోలుస్తూ.. ఆసీస్కు రిషబ్ పంత్ చుక్కలు చూపించాడని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. వేగంగా దూసుకెళ్తున్న రైలుకి ఏదైనా అడ్డొస్తే అంతే.. అంటూ మరో నెటిజన్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ను ఎద్దేవా చేశాడు.