హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనుంది.
సోమవారం కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్న పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 15వ ఓవర్ ఐదవ బంతికి హసన్ అలీ చేతిలో అవుట్ కాగా, అప్పటికి లంక స్కోరు 2 వికెట్ల నష్టానికి 282 పరుగులని ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

ఈ మేరకు పీసీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ను ఉంచగా, అది వైరల్ అయింది. నిజానికి అప్పటికి శ్రీలంక జట్టు స్కోరు 82 పరుగులుగా ఉంది. పీసీబీ చేసిన ట్వీట్ని చూసిన నెటిజన్లు పీసీబీ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇది వారి డొల్లతనానికి నిదర్శనమని, మ్యాచ్పై వారి అశ్రద్ధను ఎత్తి చూపుతోందని పలువురు పాకిస్థానీలు విమర్శలు గుప్పించగా, అసలు 15 ఓవర్లకే 282 పరుగులు సాధించడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.
ఒక దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బోర్డు అంత గుడ్డిగా ఎలా ట్వీట్లు పెడుతుందని నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరు క్రికెట్ పరువు తీశారని నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఈ ట్వీట్ను పీబీసీ తొలగించకపోవడం గమనార్హం.