
న్యూజిలాండ్ టూర్ రద్దు..
న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్లు రద్దయ్యాయి. రావల్పిండి స్టేడియంలో మొదటి వన్డే ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు న్యూజిలాండ్ జట్టు సిరీస్ మొత్తాన్నీ రద్దు చేసుకుంది. మొదట వన్డే ఇంటర్నేషనల్ను రద్దు చేసుకుంది. ఆ కాస్సేపటికే సిరీస్ మొత్తాన్నీ రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయంతో అవన్నీ రద్దయ్యాయి.

అదే బాటలో ఇంగ్లాండ్..
ఆ తరువాత ఇంగ్లండ్ జట్టు తన పర్యటనను రద్దు చేసుకుంది. తమ దేశ క్రికెటర్లకు పాకిస్తాన్లో భద్రత ఉండట్లేదనే కారణంతో- ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ రెండు దేశాల జట్ల మధ్య వచ్చేనెలలో రెండు టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉంది. భద్రత కారణాలతోనే ఈ సిరీస్ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ రెండు దేశాలు కూడా తప్పుకోవడం వల్ల స్పాన్సర్లు, టికెట్ల విక్రయాల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

27 లక్షల బిర్యానీ బిల్లు
ఇదంతా ఒక ఎత్తయితే.. బోర్డు మీద అదనపు భారం పడటం మరో ఎత్తయింది. ఏకంగా 27 లక్షల రూపాయల బిర్యానీ బిల్లును అందుకున్నారు బోర్డు అధికారులు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. పాకిస్తాన్కు చేరుకున్న తరువాత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు భద్రత కల్పించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా పోలీసులను నియమించుకుంది. అదనపు భద్రతను కల్పించింది.

అదనపు భద్రతా సిబ్బంది..
కివీస్ క్రికెట్ టీమ్ బస చేసిన హోటల్ మొదలుకుని.. స్టేడియానికి చేరుకునేంత వరకూ వెన్నంటి ఉండేలా ఈ అదనపు సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించింది. ఇందులో అయిదు మంది పోలీస్ సూపరింటెండెంట్లు, 500 మంది వరకు వివిధ స్థాయిల్లోని పోలీసులు ఉన్నారు. వారంరోజుల పాటు వారు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వెంటే ఉన్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో ఈ భధ్రతా సిబ్బంది, పోలీసులు 27 లక్షల రూపాయల విలువ చేసే బిర్యానీని లాగించేశారు.

తాటికాయ టైప్
దీనికి సంబంధించిన బిల్లును క్రికెట్ బోర్డుకు పంపించారు. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా వారు క్లెయిమ్ చేసుకున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెడుతుందనుకున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తమ పర్యటనను రద్దు చేసుకున్న షాక్ నుంచి తేరుకోక ముందే- అదనంగా 27 లక్షల రూపాయల బిర్యానీ బిల్లును అందుకోవడం క్రికెట్ బోర్డును బిత్తరపోయేలా చేసింది. మూలిగే నక్కమీద తాటి కాయ పడినట్టయింది బోర్డు పరిస్థితి.


Click it and Unblock the Notifications
