
అల్లాటప్పా అనుకుంటే ఎట్టా!
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అల్లాటప్పా విషయం కాదనేది అందరికీ తెలుసు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. వేదిక ఏదైనా, పిచ్ ఎలాంటిదైనా.. జట్టుతో, క్రికెటర్లతో సంబంధం లేకుండా, వారి ప్రమేయం అసలే లేకుండా ఓ భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంటుంది. అలాంటి సున్నితమైన మ్యాచ్లో కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వలేకపోయింది దాయాది జట్టు. తొలుత బౌలింగ్లో విఫలమైంది. టీమిండియా బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం మాట అటుంచి, కనీసం ఒత్తిడి కూడా తీసుకుని రాలేకపోయింది పాకిస్తాన్ బౌలింగ్ విభాగం.

బౌలింగ్, బ్యాటింగ్ చెత్త!
ఫలితంగా- చెలరేగిపోయి ఆడారు టీమిండియా బ్యాట్స్మెన్లు. 336 పరుగుల భారీ లక్ష్యాన్ని సర్ఫరాజ్ అండ్ టీమ్ ముందుంచారు. కనీసం బ్యాట్తోనైనా సరైన సమాధానం చెబుతారని ఆశించిన ఉంటాడు సగటు పాకిస్తానీయుడు. బౌలింగే అనుకుంటే బ్యాటింగ్లో అంతకంటే చెత్త ప్రదర్శనను కనపరిచింది. మిడిలార్డర్లో బ్యాటింగ్ వెన్నెముకగా ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన సీనియర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్- తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ చేజార్చుకోవడం కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. 89 పరుగుల భారీ తేడాతో మట్టి కరిచింది.

కోచ్పై వేటు..
తమ జట్టు ఘోర పరాజయం పాలైన తరువాత ఓటమికి గల కారణాలను తీరిగ్గా వెదుక్కుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యం. జట్టు విఫలం కావడానికి కనిపించిన మొట్టమొదటి కారణం కోచ్. హెడ్ కోచ్ మిక్కీ అర్థర్ను ఇక ఇంటికి సాగనంపాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ షెడ్యూల్తో పాటుగానే కోచ్గా మిక్కీ అర్థర్ పదవీ కాలం ముగుస్తుంది. ఇక ఆయన కాంట్రాక్టును పొడిగించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ కోచ్గా మిక్కీ అర్థర్ మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్ను దెబ్బకొట్టి మరీ కప్పును ఎగరేసుకెళ్లింది. అయినప్పటికీ- తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అర్థర్ పదవీ కాలాన్ని పొడిగించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నెక్ట్స్ ఎవరు?
మిక్కీ అర్థర్ తరువాత తరువాతి వేటు చీఫ్ సెలెక్టర్, మాజీ బ్యాట్స్మెన్ ఇంజమామ్ ఉల్ హక్ పడే అవకాశాలు లేదని చెబుతున్నారు. ఇంజమామ్ నేతృత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తాయని, గ్రూపిజం ఏర్పాటైందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. జట్టులో చాలామందితో పోల్చుకుంటే కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ జూనియర్. ఈ విషయంపై కొందరు సీనియర్లలో అభిప్రాయభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఉద్దేశపూరకంగానే సీనియర్లు సర్ఫరాజ్కు సహకరించలేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ గ్రూపిజానికి కేంద్ర బిందువు ఇంజమామ్ ఉల్ హక్ అని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో- ఆయనను కూడా తప్పించ వచ్చని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications












