ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పేలవ ప్రదర్శనతో లీగ్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టిన పాకిస్థాన్.. మళ్లీ అదే తీరును కనబరిచింది. తాజాగా న్యూజిలాండ్తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్నూ ఘోర ఓటమితో ప్రారంభించింది. తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో ఓటమిని అందుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్.. కివీస్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులే చేసి ఆలౌట్ అయింది. బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. మొదటి ఓవర్ నుంచే పాకిస్థాన్ బ్యాటర్లను.. న్యూజిలాండ్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు తీశారు.

ఒక్క వికెటే..
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోయి 10.1 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫిన్ అలెన్(29), రాబిన్సన్(18) మ్యాచ్ను అజేయంగా నిలిచి ముగించారు.
వాస్తవానికి ... ఈ సిరీస్ కోసం స్టార్ బ్యాటర్లపై వేటు వేసి, కొత్త ఆటగాళ్లను పీసీబీ ఎంపిక చేసింది. కానీ వాళ్లు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పైగా పాకిస్థాన్ కూడా ఓటమి చెందడంతో.. ఆ జట్టుపై విమర్శలు కురిపిస్తున్నారు. మీమ్స్ రూపంలో ఆ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు.
తిరిగి పుంజుకుంటాం..
మ్యాచ్ ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. "కష్టంగా అనిపించింది. మేం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. కానీ మేము తిరిగి పుంజుకోవాలి. వారు నిజంగా బాగా బౌలింగ్ చేశారు. కాస్త సీమ్ మూమెంట్ కూడా ఉంది. మా తప్పిదాలను ఏంటో పరిశీలించుకుని, తదుపరి మ్యాచ్ లో అవి పునరావృతం కాకుండా చూస్తాం. మాకు ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్ళు ఉన్నారు. వారు ఎక్కువ మ్యాచులు ఆడితే, మరింత నేర్చుకుంటారు. న్యూజిలాండ్లో కొత్త బంతి కొంతవరకు పనిచేస్తుంది. మాకు మంచి బౌలర్లు ఉన్నారు. తదుపరి మ్యాచ్లో మేము బాగా రాణించాలని ఆశిస్తున్నాను." అని అన్నాడు.