ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్తో తలపడేందుకు అర్హత సాధించిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తన జట్టు అద్భుతంగా ఆడిందని పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్పై స్వల్ప తేడాతో గెలుపొందడంపై మాట్లాడిన పాకిస్తాన్ కెప్టెన్.. ఫైనల్లో భారత్ను ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని పూర్తి విశ్వాసం చూపించారు.
విజయానికి కారణం' జట్టు బలం
మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ, "ఇలాంటి కష్టమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్లను గెలిచామంటే, మేం కచ్చితంగా ఒక ప్రత్యేకమైన జట్టు అయి ఉండాలి" అని అన్నారు. తమ జట్టులోని ప్రతి ఒక్కరూ బాగా ఆడారని ప్రశంసించారు. అయితే టోర్నమెంట్లో నిలకడగా లేని బ్యాటింగ్పై స్పందిస్తూ.. బ్యాటింగ్లో కొంత మెరుగుదల అవసరం ఉందని, దానిపై మేము కచ్చితంగా పని చేస్తామని లోపాలను అంగీకరించారు.

పేసర్లు అద్భుతం.. ఫీల్డింగ్పై కోచ్ ప్రభావం
బౌలింగ్లో తమ జట్టు ప్రదర్శన అద్భుతమని సల్మాన్ కొనియాడారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని అభినందిస్తూ.. "షాహీన్ ఒక అద్భుతమైన ఆటగాడు. జట్టుకు ఏది అవసరమో అతను అదే చేస్తాడు. అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం" అని పేర్కొన్నారు. తక్కువ స్కోరు చేసినప్పటికీ, దానిని కాపాడుకోవడంపై స్పష్టత ఇచ్చారు. "మేము సుమారు 15 పరుగులు తక్కువగా చేశాం. కానీ, మేము కొత్త బంతితో బౌలింగ్ చేసిన తీరు చూస్తే, మేము ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాం. ఇలా బౌలింగ్ చేస్తే, చాలా సందర్భాలలో మీరు తప్పకుండా మ్యాచ్లు గెలుస్తారు" అని బౌలింగ్ యూనిట్ను పొగడ్తలతో ముంచెత్తారు.
జట్టు ఫీల్డింగ్లో వచ్చిన మెరుగుదలకు కారణాన్ని కూడా సల్మాన్ వెల్లడించారు. "మేము బాగా ఫీల్డింగ్ చేస్తున్నాం. కోచ్ షేన్ మాపై చాలా కష్టపడుతున్నారు. మేము అదనపు సెషన్లు తీసుకుంటున్నాం. కోచ్ మైక్ హెస్సన్ ఒక విషయం స్పష్టం చేశారు - మీరు ఫీల్డింగ్ చేయలేకపోతే, జట్టులో ఉండలేరు అని. ఈ మాటలు మాకు ప్రేరణగా నిలిచాయి." అని వివరించారు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఆసియా కప్ 2025లో డూ ఆర్ డైమ్యాచ్లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ను 11 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీంతో, ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో పాకిస్థాన్ జట్టు భారత్తో తలపడనుంది. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ, బంగ్లాదేశ్కు ఓటమి తప్పలేదు.
భారత్కు సవాల్
చివరగా, టైటిల్ పోరుపై సల్మాన్ ధీమా వ్యక్తం చేశారు. "మాకు ఎవరినైనా ఓడించగలిగేంత సామర్థ్యం ఉంది. ఆదివారం (ఫైనల్) తిరిగి వచ్చి, అదే చేసి చూపిస్తాం" అంటూ తమ దాయాది జట్టు భారత్కు సవాల్ విసిరారు.పాకిస్థాన్ జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్లో జరిగే ఆసియా కప్ ఫైనల్లో భారత్తో తలపడనుంది.