ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025లో ఉమెన్ ఇన్ బ్లూ చేతిలో 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన తర్వాత పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తమ జట్టు చేసిన పొరపాట్లను అంగీకరించింది. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్లలో చేసిన తప్పిదాల వల్లే మ్యాచ్ చేజారిందని అభిప్రాయపడింది. భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోవడంపై ఫాతిమా సనా ప్రధానంగా దృష్టి సారించింది. "ఆరంభంలో, అంటే పవర్ప్లేలో మేం చాలా ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. అలాగే, డెత్ ఓవర్లలో కూడా కొన్ని అదనపు పరుగులు పోగొట్టుకున్నాం. ఈ అదనపు పరుగులే భారత్ స్కోరు పెరగడానికి కారణమయ్యాయి" అని పాకిస్థాన్ కెప్టెన్ పేర్కొంది.
తన సహచర బౌలర్ డయానా బేగ్ బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. "నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ సీమ్ అవుతున్నట్లు అనిపించింది. కానీ డయానా (డయానా బేగ్) సీమ్, స్వింగ్ల మధ్య కొంచెం గందరగోళానికి గురైంది. అందుకే నేను ఆమెకు పదేపదే సూచనలు ఇచ్చాను. తదుపరి మ్యాచ్లో ఆమె తప్పకుండా మెరుగవుతుందని అనుకుంటున్నాను" అని ఫాతిమా సనా నమ్మకం వ్యక్తం చేసింది.

బ్యాటర్లు బాధ్యత తీసుకోవాలి..
భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యంపై ఫాతిమా స్పందిస్తూ, "మేము భారత్ను 200 పరుగులలోపు కట్టడి చేయగలిగితే, అది మాకు మంచి స్కోర్ అయ్యేది. అయితే దాన్ని చేయలేకపోయాం" అని నిరాశ వ్యక్తం చేసింది.ఛేదనలో తమ వ్యూహం గురించి మాట్లాడుతూ, "మా నేటి టాప్-5 బ్యాటింగ్ లైనప్ ప్యూర్ బ్యాటర్లతో కూడుకున్నది. కాబట్టి వారు బ్యాటింగ్లో తప్పకుండా ముందుకు వచ్చి రాణించాలి. మెరుగైన ఫలితాల కోసం దీర్ఘ భాగస్వామ్యాలు నిర్మించడం చాలా ముఖ్యం. క్రీజ్లో నిలబడి, పరిస్థితులను అంచనా వేస్తూ, దానికి తగ్గట్టుగా ఆడటం నేర్చుకోవాలి" అని తన బ్యాటర్లకు సూచించింది.
భారత్తో మ్యాచ్లో 81 పరుగులు చేసిన సిద్రా అమీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఫాతిమా, "ఆమె మా జట్టులో కీలకమైన ప్లేయర్, చాలా కష్టపడుతుంది. అల్లా సహాయంతో తను రాబోయే మ్యాచ్లలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నాను." అని తన నమ్మకాన్ని తెలియజేసింది. టోర్నమెంట్లో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నందున, జట్టు ఆటగాళ్లు మరింతగా తమను తాము నిరూపించుకోవాలని ఆమె సూచించింది.
చిత్తుగా ఓడిన పాకిస్థాన్
ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025లో భారత జట్టు దాయాది పాకిస్థాన్ ను మరోసారి చిత్తుగా ఓడించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆరో మ్యాచ్లో 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నమెంట్లో భారత్కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. పాకిస్థాన్కు రెండో ఓటమి కావడం గమనార్హం. వన్డే ఫార్మాట్లో పాకిస్థాన్పై భారత్ తరచూ గెలుపొందుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన 12 వన్డేల్లోనూ టీమిండియాదే పైచేయి కావడం విశేషం.