చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్కు పాకిస్థాన్ ఊపు తెచ్చింది. అయితే పాక్ తమ ఆటతో మెగాటోర్నీలో జోష్ నింపలేదు. ఎప్పటిలానే, ఎవరూ ఊహించినట్టుగానే.. చెత్త ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది. అమెరికా చేతిలో ఓటమిపాలై ఘోరంగా విమర్శల పాలవుతుంది. అయితే పసికూన చేతుల్లో పాకిస్థాన్ ఓటమిపాలవ్వడం ఇదేం కొత్త కాదు. ముఖ్యంగా బాబర్ అజామ్ కెప్టెన్సీలో గతంలోనూ జరిగింది.
2022 టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో అఫ్గానిస్థాన్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అయితే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో ఓటమిని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐసీసీ సైతం టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత కలత చెందిన ఓటమిగా పాక్-అమెరికా మ్యాచ్ను అభివర్ణించింది.

అయితే పాకిస్థాన్ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ బాబర్ అజామ్ అని ట్రోల్స్ వస్తున్నాయి. ఈ మ్యాచ్లో మొదట పాక్లో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. బాబర్ టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ పోరులో యూఎస్ఏ 18 పరుగులు చేయగా, పాకిస్థాన్ 13 పరుగులకే పరిమితమైంది.
అయితే బాబర్ అజామ్ 43 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 102 స్ట్రైక్రేటుతో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. 26 పరుగులకే పాక్ మూడు వికెట్లు కోల్పోవడంతో బాబర్ అతిజాగ్రత్తగా ఆడాడు. పాక్ కెప్టెన్ సూపర్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లడంతో స్కోరుబోర్డు నెమ్మదిగా కదిలింది. ఇది జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో బాబర్ను నెట్టింట్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
బాబర్ అజామ్ను అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఔట్ చేయలేదని, బాబర్ ఔటైతే పాక్ స్కోరు వేగం పెరుగుతుందని భావించి వికెట్ను ఆలస్యంగా తీసిందని పోస్టులు పెడుతున్నారు. దీనికి కొందరు నెటిజన్లు వాట్ ఏ థాట్..వాట్ ఏ విజన్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్గా వచ్చిన బాబర్ అజామ్ 16వ ఓవర్ అయిదో బంతికి ఔటయ్యాడు.