భారత్ను న్యూజిలాండ్ వైట్ వాష్ చేయడాన్ని ఆ జట్టు ఆటగాళ్ల కంటే పాకిస్థాన్, ఇంగ్లండ్ మాజీలు ఎక్కువగా ఆనందిస్తున్నారు. స్వదేశంలో కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలింది.
91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ ఏడాది స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో భారత్కు ఇది నాలుగో ఓటమి. 1969 తర్వాత సొంతగడ్డపై ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. అయితే ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్, పాకిస్థాన్ మాజీ ప్లేయర్ల వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ తొలి వన్డేలో వ్యాఖ్యాతలుగా ఉన్న మైకేల్ వాన్, వసీమ్ అక్రమ్ టీమిండియా గురించి మాట్లాడారు. స్పిన్ పిచ్లపై భారత బ్యాటర్ల తడబాటును ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. 'భారత్ వర్సెస్ పాకిస్థాన్ టెస్టు సిరీస్ చూడాలని ఉంది' అని మైకేల్ వాన్ టీమిండియా గురించి మొదలుపెట్టాడు. దానికి వసీమ్ అక్రమ్ స్పందిస్తూ.. 'అది ఎంతో గొప్పగా ఉంటుంది. అది ఆటకు, క్రికెట్ను ఆరాధించే ఇరు దేశాలకు ఎంతో మంచిది' అని అన్నాడు.
'టర్న్ పిచ్లపై ఇప్పుడు భారత్ను పాకిస్థాన్ ఓడించగలదు' అని మైకేల్ వాన్ సంభాషణ కొనసాగించాడు. దానికి వసీమ్ అక్రమ్ ఇలా బదులిచ్చాడు. 'అవును, స్పిన్ ట్రాక్లపై భారత్ను పాకిస్థాన్ ఓడించే అవకాశాలు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 0-3తో చిత్తుగా ఓటమిపాలైంది' అని అక్రమ్ పేర్కొన్నాడు. స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడిన చివరి రెండు టెస్టుల్లో భారత బ్యాటర్లను న్యూజిలాండ్ స్పిన్నర్లే పెవిలియన్ చేర్చారు. పేసర్లు సాధించిన మూడు వికెట్ల మినహా మిగిలిన వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోనే చేరాయి (రనౌట్లను మినహాయిస్తే).