
అండర్ 19 ఆసియా కప్లో భాగంగా నేడు పాకిస్థాన్ అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత అండర్ 19 జట్టు ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో పాక్ జట్టు ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 3 ఫోర్లతో ఆరాధ్య 50 పరుగులు చేశాడు. ఓపెనర్ హర్నూర్ సింగ్ 46 పరుగులు చేయగా, కౌశల్ తాంబే 32 పరుగులు చేశాడు.
పదో నంబర్ బ్యాటర్ రాజవర్ధన్ హంగర్గేకర్ 20 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు స్కోర్ 200 దాటించాడు. రాజ్ బావ 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. కెప్టెన్ యష్ ధుల్తోపాటు ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ డకౌట్ అయ్యారు. పాక్ బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన భారత్ ఏ దశలోనూ మంచి స్కోర్ సాధించేలా కనిపించలేదు.
238 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే భారత బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ అబ్దుల్ వాహిద్ పరుగులేమి చేయనివ్వకుండానే డకౌట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత రెండో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక 29 పరుగులు చేసిన ఓపెనర్ మాజ్ సదాకత్ను రాజ్ బావ ఔట్ చేశాడు. ఆ వెంటనే రాజ్ బావ మరో వికెట్ తీయడంతో పాక్ 69 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోర్ 115 పరుగుల వద్ద ఉండగా 22 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ ఖాసిం అక్రమ్ను నిశాంత్ సింధు ఎల్బీగా ఔట్ చేశాడు. స్కోర్ 159 పరుగులు వద్ద ఉండగా 81 పరుగులతో చెలరేగుతున్న ముహమ్మద్ షెజాద్ను రాజవర్ధన్ హంగర్గేకర్ రనౌట్ చేశాడు.

206 పరుగుల స్కోర్ వద్ద 29 పరుగులు చేసిన రిజ్వాన్ మహ్మద్ను రాజ్ బావ ఔట్ చేశాడు. దీంతో పాక్ జట్టు 46 ఓవర్లలో 6 వికెట్లో కోల్పోయి 206 పరుగులతో నిలిచింది. అదే విధంగా జట్టు స్కోర్ 220 పరుగుల వద్ద ఉండగా 32 పరుగులు చేసిన ఇర్ఫాన్ ఖాన్ను రాజ్ బావ ఔట్ చేశాడు. చివరి ఓవర్లో పాక్ విజయానికి 8 పరుగులు చేయాల్సిన సమయంలో తొలి బంతికే జీషన్ జమీర్ను డకౌట్ చేశాడు రవికుమార్.
అయితే అహ్మద్ ఖాన్ చివరి వరకు ఆడి ఇన్నింగ్స్ చివరి బంతికి పాకిస్థాన్కు విజయాన్ని అందించాడు. దీంతో భారత్పై 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. అహ్మద్ 19 బంతుల్లోనే 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్ బావ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, రవి కుమార్ తలో వికెట్ తీశారు.