హైదరాబాద్: పాకిస్థాన్కు చెందిన బిలాల్ (26) అనే యువ క్రికెటర్ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. 50 ఓవర్ల మ్యాచ్లో 175 బంతులు ఎదుర్కొని 320 పరుగులతో నాటౌట్గా నిలిచి ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. స్థానిక పీసీబీ ఫజల్ మహమూద్ నేషనల్ క్లబ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో ఈ రికార్డు నమోదైంది.
గురువారం షాహీద్ అలామ్ బక్స్ క్రికెట్ క్లబ్కు నేతృత్వం వహించిన బిలాల్ ఓపెనర్గా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్న బిలాల్ 175 బంతుల్లో 42 ఫోర్లు, 9 సిక్సర్లతో 320 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు జకీర్ హుస్సేన్తో కలిసి రెండో వికెట్కు అత్యధికంగా 364 పరుగులు జోడించారు.
బిలాల్ విధ్వంసర బ్యాటింగ్ ధాటికి షాహీద్ అలామ్ జట్టు 50 ఓవర్లలో 556 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టుపై 411 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. క్లబ్ క్రికెట్కు సంబంధించి సరైన రికార్డులు లేకపోయినా.. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే టాప్ ఇన్నింగ్స్గా భావిస్తున్నారు.
ఇంతక ముందు ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ టీ20లో 300 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే. లక్ష్మీనగర్లో జరిగిన ఓ లోకల్ టీ20 మ్యాచ్లో మావీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టుపై 300 పరుగులు చేశాడు.
మరోవైపు భారత్కు చెందిన సంకృత శ్రీరామ్ స్కూల్ విద్యార్ధి 486 పరుగులే ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో రికార్డు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో అతడు ఓ ఇంటర్ స్కూల్ టోర్నీలో ఆ ఘనత సాధించాడు.