లాహోర్: లాహోర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. లంక యువ బ్యాట్స్మన్ భానుక రాజపక్స చెలరేగడంతో సోమవారం జరిగిన టీ20లో 35 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కోల్పోయిన లంక టీ20 సిరీస్లో మాత్రం దుమ్ములేపుతోంది.
పరాజయాల హ్యాట్రిక్.. మారని తెలుగు టైటాన్స్ ఆట!!
మొదట బ్యాటింగ్ చేసిన లంక 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేరీర్లో రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న యువ ఆటగాడు రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. షిహాన్ జయసూర్య (34) రాణించాడు. ఓపెనర్లు గుణతిలక (15), ఫెర్నాండో (8) విఫలమయినా.. రాజపక్స అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లలో స్టార్ పేసర్ మహమ్మద్ అమీర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో హ్యాట్రిక్తో చెలరేగిన మహమ్మద్ హస్నైన్ కూడా వికెట్ తీయకుండా 39 పరుగులు ఇచ్చాడు. షాదాబ్, ఇమాద్ వాసిమ్, వాహబ్ రియాజ్ తలో వికెట్ తీశారు.
183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. నువాన్ ప్రదీప్ 4-25తో అదరగొట్టగా.. లెగ్ స్పిన్నర్ హసరంగా 3-38తో రాణించాడు. ఇమద్ వసీమ్ (47) రాణించాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (26) ధాటిగా ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పాక్ జట్టు మ్యాచ్ ఆరంభం నుండే వికెట్లు కోల్పోవడంతో.. ఏ సమయంలో కూడా విజయం దిశగా పయనించలేదు. లంక ఇప్పటికే 2-0తో సిరీస్ సొంతం చేసుకోగా.. చివరి మ్యాచ్ బుధవారం లాహోర్లో జరుగనుంది.
భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ జట్టులో పది మంది ఆటగాళ్లు పాక్ పర్యటనకు రావడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఏ మాత్రం అనుభవం లేని లంక జట్టు టీ20ల్లో ఘనమైన రికార్డున్న పాక్ను మట్టికరిపించింది. వన్డే సిరీస్ను కోల్పోయిన లంక.. టీ20 సిరీస్లో అంచనాలు మించి రాణించారు. వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం.