పల్లెకెలె: వరుస గెలుపులతో గ్రూప్ ఏలో ముందంజలో ఉన్న పాకిస్తాన్ మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ లో ఘోర పరాజయం పాలైంది. ఓ ఓవర్ లో అక్తర్ ఏకంగా 28 పరుగులు ఇవ్వడంతో న్యూజిలాండ్ మొదట 302 పరుగుల భారీ పరుగులు సాధించి పాకిస్తాన్ ముందు 303 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. చివరి నాలుగు ఓవర్ల సమయంలో టేలర్ క్రీజులో ఉన్నా అతడు ఫామ్ లో లేడు గనుక స్కోరు 250 చేయడం గగనమనుకున్నారంతా. అక్తర్ బౌలింగ్ లో తొలి బంతిని బౌండ్రీగా, తర్వాతి రెండు బంతులను భారీ సిక్సర్లుగా బా దాడు. ఇదే ఓవర్లో మరో ఫోర్, సిక్సర్ బాదాడు.ఇవన్నీ చాలవన్నట్టు అక్త ర్ రెండు వైడ్లు బోనస్ గా ఇవ్వడంతో ఈ ఓవర్లో మొత్తంగా 28 పరుగులు రాబట్టాడు టేలర్. అంతేకాదు పుట్టినరోజున సెంచరీ సైతం పూర్తిచేశాడు. ఇక బ్యాటింగ్ పవర్ ప్లే ముగిసింది, బ్యాట్స్ మెన్ దూకుడు తగ్గుతుందన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. రెహ్మాన్ వేసిన 48వ ఓవర్లో మరోవైపునున్న జాకబ్ ఓరమ్ 25 ఫోర్, సిక్సర్ తో 15 పరుగులు రాబట్టాడు. రజాక్ కు 49వ ఓవర్ అప్పగించగా టేలర్ ఈ ఓవర్లో రెండు బౌండ్రీలు, మూడు సిక్సర్లతో చెలరేగడంతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇక చివరి ఓవర్లో పాక్ 19 పరుగులు సమర్పించుకోవడంతో చివరి నాలుగు ఓవర్లలో 92 పరుగులు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాబట్టగలిగారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్ టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూసింది. టేలర్ 124 బంతుల్లో 131 నాటౌట్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.