ఇస్లామాబాద్: వన్డే ఇంటర్నేషనల్స్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. నయా రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డ్- ఆస్ట్రేలియా, భారత్ పేరు మీదే ఉంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన చేరింది పాకిస్తాన్. న్యూజిలాండ్పై తొలి వన్డేలో సాధించిన విజయం- దీనికి కారణమైంది.
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు- పాకిస్తాన్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అయిదు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడటానికి కివీస్.. పాక్లో అడుగుపెట్టింది. బాబర్ ఆజమ్ సేనతో తలపడుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ సమం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్లల్లో పాకిస్తాన్ విజయం సాధించగా.. మూడు, అయిదు మ్యాచ్లను న్యూజిలాండ్ తన ఖాతాలో వేసుకుంది. నాలుగో మ్యాచ్ రద్దయింది.

తాజాగా- ఈ రెండు జట్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్- గురువారం రాత్రి రావల్పిండిలో ముగిసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిందా టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
టాప్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిఛెల్ సెంచరీ బాదాడు. 115 బంతుల్లో ఒక సిక్స్ 11 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. ఓపెనర్ విల్ యంగ్ 86 పరుగులతో సత్తా చాటాడు. పాక్ బౌలర్లు షహీన్ షా అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. షాదబ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ అలవోకగా టార్గెట్ను కొట్టేసింది. 48.3 ఓవర్లల్లో అయిదు వికెట్లను మాత్రమే నష్టపోయి 291 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫకర్ జమాన్ 117 పరుగులు చేశాడు. ఇమాముల్ హక్-60, కేప్టెన్ బాబర్ ఆజమ్- 49, మహ్మద్ రిజ్వాన్-42 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆడమ్ మిల్నే-2, బ్లెయిర్ టిక్నర్, ఈషో సోధి, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయిదు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది. శనివారం ఇదే రావల్పిండి స్టేడియంలో రెండో మ్యాచ్ షెడ్యూల్ అయింది.
కాగా- ఈ విజయంతో పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును అందుకుంది. ఇది వన్డే ఇంటర్నేషనల్స్ హిస్టరీలో పాకిస్తాన్ అందుకున్న 500 విజయం. ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే ఈ క్లబ్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్.. ఇప్పటికే 500 విజయాలను అందుకున్నాయి. ఆస్ట్రేలియా- 594, భారత్-539 వన్డే మ్యాచ్లల్లో గెలిచాయి. తాజాగా ఈ రెండింటి సరసన చేరింది పాకిస్తాన్.