
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసి.. నమీబియా ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ చివరి ఓవర్లో చివలెత్తాడు. ఏకంగా ఐదు బౌండరీలు బాదాడు. దాంతో పాక్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రిజ్వాన్ 50 బంతుల్లో 79 పరుగులు చేసి నాట్ అవుట్గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 49 బంతుల్లో 70 పరుగులు చేయగా.. సీనియర్ బ్యాటర్ మొహ్మద్ హఫీజ్ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైజ్, జాన్ ఫ్రైలింక్ తలో వికెట్ పడగొట్టారు. ఇక స్మిత్ 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్కు మంచి ఆరంభం దక్కింది. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. ఎక్కువగా బౌండరీల జోలికి పోకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు మాత్రమే చేశారు. అజామ్, రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. రుబెన్ ట్రంపుల్మన్ వేసిన 12వ ఓవర్లో బాబర్ అజామ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచి దూకుడుగా ఆడుతున్న సమయంలో డేవిడ్ వైజ్ వేసిన 15వ ఓవర్లో జాన్ ఫ్రై లింక్కి చిక్కి బాబర్ పెవిలియన్ చేరాడు.
బాబర్ ఆజమ్ అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డ్ హిట్టర్ ఫకార్ జమాన్ విఫలమయ్యాడు. ఐదు బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఫకార్ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన వెటరన్ బ్యాటర్ మహమ్మద్ హఫీజ్ (32) ధాటిగా ఆడాడు. వచ్చిరావడంతోనే హఫీజ్ బౌండరీలు బాది పాక్ ఇన్నింగ్స్కు ఊపుతెచ్చాడు. మరోవైపు మహమ్మద్ రిజ్వాన్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే నమీబియా బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేసినా.. ఆఖర్లో మాత్రం తేలిపోయారు. చివరి ఓవర్లో చెలరేగిన రిజ్వాన్ ఏకంగా ఐదు బౌండరీలు బాదాడు. దీంతో పాకిస్థాన్ భారీగా పరుగులు రాబట్టింది. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైజ్, జాన్ ఫ్రై లింక్ తలో వికెట్ తీశారు.