ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైన పాకిస్థాన్ రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి ముల్తాన్ వేదికగానే రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని జట్టు కూర్పు విషయంలో సెలక్షన్ కమిటీ చాలా సీరియస్గా ఉంది.
ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ను జట్టు నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు ఓటమి అనంతరం పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్, కోచ్ గిలెస్పీ బాబర్ అజామ్కు మద్దతు ఇచ్చారు. కానీ సెలక్షన్ కమిటీలో మిగిలిన సభ్యులు బాబర్ అజామ్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలీందార్, ఆఖిబ్ జావెద్, అజర్ అలీలు బాబర్ను తప్పించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.

2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్పై కూడా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. కాగా, బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
సారథి బాధ్యతలకు సెలవు అంటూ బాబార్ వీడ్కోలు చెప్పడం ఇది రెండో సారి. 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన అనంతరం జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ ముంగిట తిరిగి వైట్ బాల్కు బాబార్ అజామ్ను తిరిగి కెప్టెన్గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ మెగాటోర్నీలో పాక్ ఘోర వైఫల్యాలను చవిచూసింది. అమెరికాతో చేతిలోనూ ఓటమిపాలై కనీసం గ్రూప్ స్టేజ్ను కూడా దాటలేకపోయింది.
మరోవైపు కెప్టెన్సీ మార్పులపై పాకిస్థాన్ టీమ్లో ఐకమత్యం దెబ్బతిందని సమాచారం. ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసింది. ఈ క్రమంలో బాబార్ అజామ్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారని ప్రచారం కూడా మొదలైంది. అయితే బాబర్యే సారథి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న బాబర్ అజామ్ను తప్పించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.