పాకిస్థాన్కు ఊహించని పరాభవం ఎదురైంది. టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ తమ పేరిట చెత్త రికార్డు నమోదుచేసింది. సొంతగడ్డపై టెస్టుల్లో పది వికెట్ల తేడాతో తొలిసారి ఓటమిపాలైంది. అంతేగాక స్వదేశంలో పాకిస్థాన్ జట్టు సుదీర్ఘ ఫార్మాట్లో గెలుపు రుచి చూడక ఇప్పటికీ 1294 రోజులు గడవడం గమనార్హం. 2021లో సొంతగడ్డపై సౌతాఫ్రికాపై సాధించిన విజయమే ఆఖరిది.
ఈ జాబితాలో జింబాబ్వే (4002 రోజులు) అగ్రస్థానంలో, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. అయితే జింబాబ్వే ఈ పేలవ రికార్డు కోసం 11 ఏళ్లలో 14 టెస్టులు ఆడింది. కానీ పాకిస్థాన్ మూడేళ్ల వ్యవధిలో తొమ్మిది టెస్టులు ఆడటం గమనార్హం. అంతేగాక ఈ మ్యాచ్లో పాక్ మరో పేలవ రికార్డు సాధించింది. తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి పాక్ ఓటమిపాలవ్వడం నాలుగో సారి. ఎనిమిదేళ్ల తర్వాత ఈ కోరుకోని ఘనత సాధించింది.

1961లో ఇంగ్లండ్పై (387/9 డిక్లేర్) తొలిసారి, ఆ తర్వాత 1972లో ఆస్ట్రేలియాపై (574/8 డిక్లేర్), 2016లో ఆస్ట్రేలియాపై (443/9 డిక్లేర్), ఈసారి బంగ్లాదేశ్పై (448/6) డిక్లేర్ చేసి మరీ ఓటమిపాలైంది. కాగా, ఈ మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు. నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.