|
సుత్తెతో మట్టి తవ్విన వార్నర్
టెస్టు మ్యాచ్లో చివరి రోజు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో పిచ్ వారికి కాస్త ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్ చేయడానికి పరిగెత్తుతూ వచ్చి స్టంప్స్ వద్ద కాళ్లు ల్యాండ్ చేసి బంతి విసిరే దగ్గర కొంత పిచ్ అసౌకర్యంగా తయారయింది. దీంతో బౌలింగ్ చేయడానికి బౌలర్లకు ఇబ్బందికరంగా మారింది.
దీంతో అంపైర్ల అనుమతితో గ్రౌండ్ మ్యాన్ నుంచి సుత్తె తీసుకున్న వార్నర్ పిచ్ను సమంగా చేయడానికి కొంత మట్టిని తవ్వాడు. ఈ ఘటన పాకిస్థాన్ స్కోర్ 380-4 ఉన్న సమయంలో చోటు చేసుకుంది. అప్పటికీ 155 ఓవర్లు పూర్తయ్యాయి.
|
వార్నర్ భార్య ట్రోల్
ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనికి మరొక థోర్ మ్యాన్ అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన వార్నర్ భార్య అతడిని ట్రోల్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఇంటి చుట్టూ కూడా సుత్తితో అలా పని చేయాలని రాసుకొచ్చింది. అయితే ఆ పని ఇంటి చుట్టూ ఇంకొంచెం ఎక్కువగానే చేయాలని కోరింది.
ఇక డేవిడ్ వార్నర్, కాండిస్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనే సంగతి తెలిసిందే. కాగా మే 29 వరకు డేవిడ్ వార్నర్ కుటుంబాన్ని కలిసే అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్థాన్తో సిరీస్ ముగిసిన వెంటనే వార్నర్ ఐపీఎల్లో ఆడనున్నాడు. ఐపీఎల్ మే చివర్లో ముగియనుంది.
పాట్ కమిన్స్ కూడా..
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్కు కూడా పాకిస్థాన్తో టెస్టు మ్యాచ్లో ఈ పని తప్పలేదు. నాల్గో రోజు ఆటలో గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి సమస్యనే వచ్చింది. దీంతో అంపైర్ల అనుమతితో గ్రౌండ్మ్యాన్ నుంచి సుత్తె తీసుకున్న కమిన్స్ పిచ్ను కాస్త తవ్వి సమంగా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దీనికి కమిన్స్ నయా థోర్ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది.
టెస్ట్ మ్యాచ్ డ్రా
ఇక ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేయగా పాకిస్థాన్ 148 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 97-2 డిక్లేర్ చేయగా.. పాకిస్థాన్ 443-7 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.