
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి బాగా పేరు తెచ్చిన విషయం అతని ఛేజింగ్. తన కెరీర్లో బాదిన 46 సెంచరీల్లో 22 శతకాలను అతను ఛేజింగ్లోనే చేశాడు. క్రీజులో కుదురుకుంటే ఎంతటి భారీ స్కోరు అయినా ఛేజ్ చేసేయడం కోహ్లీ స్పెషాల్టీ. అందుకే అతన్ని అభిమానులు 'ఛేజ్ మాస్టర్' అని పిలుస్తుంటారు. అలాంటి వాడు ఛేజింగ్ చేస్తూ ఇచ్చిన సింపుల్ క్యాచ్ వదిలేస్తే? ఆ ఫీల్డర్కు ఎలాంటి ఆలోచనలు వస్తాయి?
ఇదే అనుభవం పాకిస్తాన్ వెటరన్ అజహర్ అలీకి ఎదురైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను అతను వదిలేశాడు. స్లిప్స్లో ఉన్న అతను ఈ క్యాచ్ వదిలేసిన తర్వాత తనకు ఏం జరగబోతుందో కళ్ల ముందు కదలాడిందని చెప్పాడు. అప్పటికే మహమ్మద్ ఆమిర్ బౌలింగ్లో టీమిండియా ఓపెనర్లు కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో కోహ్లీ ఇచ్చిన చాలా సింపుల్ క్యాచ్ను అలీ నేలపాలు చేయడం పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 338 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. మహమ్మద్ ఆమిర్ బౌలింగ్లో తేలిపోయిన టాపార్డర్ చేతులెత్తేసింది. దీంతో భారత జట్టు కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్పై అత్యంత ఘోరమైన ఓటమిని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 9 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇదే విషయాన్ని అలీ గుర్తుచేసుకున్నాడు.
కోహ్లీ తను ఎదుర్కొన్న 8వ బంతికి క్యాచ్ ఇస్తే అలీ జారవిడిచాడు. 'అప్పుడు నాకు రియాలిటీ కనిపించింది. చాలా విషయాలు కళ్లముందు కదలాడాయి. నా భుజాలపై బరువు పెరిగినట్లు అనిపించింది. ప్రపంచం మొత్తం నావైపు చూస్తూ ఏం చేశాడో చూడండి అంటున్నట్లు టెన్షన్ ఫీలయ్యా. కోహ్లీ కనుక తన స్పెషాల్టీ చూపించి, భారీ స్కోరు చేసి టార్గెట్ కనుక ఛేజ్ చేస్తే.. ఫ్యాన్స్ అంతా దాడి చేసి నా ఇల్లు కూల్చేస్తారని అనుకున్నా. అదృష్టం కొద్దీ.. నేను ఈ ఆలోచనలో ఉండగానే మరుసటి బంతికే కోహ్లీ అవుటయ్యాడు' అని అలీ గుర్తుచేసుకున్నాడు.