
ఆసియా కప్ - 2022 గ్రూప్-స్టేజ్ మ్యాచ్లో భారత బౌలింగ్లో పాకిస్థాన్ భారీగా పరుగులు రాబట్టుకోవాలని, పూర్తిగా భారత బౌలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్-మీడియం పేసర్ సర్ఫరాజ్ నవాజ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆగస్టు 28న జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ ఆఫ్రిది గాయాల కారణంగా వైదొలగడంతో టోర్నమెంట్కు ముందు రెండు జట్లకు పెద్ద దెబ్బ తగిలింది.
బుమ్రా గాయంతో దూరం కాగా ఆసియా కప్కు మహ్మద్ షమీ సెలెక్ట్ కాలేదు. అలాగే హర్షల్ పటేల్ కూడా గాయంతో మిస్సయ్యాడు. భువనేశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో భారత బౌలింగ్ ఎటాక్ కొనసాగనుంది. ఇక ఆసియాకప్కు ఎంపికైన 15మంది సభ్యుల జట్టులో అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు. వీళ్లు ఇటీవలే అరంగేట్రం చేసిన ప్లేయర్లు.. వీరిద్దరు కలిసి కేవలం 19 టీ20లు మాత్రమే ఆడారు. ఇక భువీ.. ఈ జూనియర్లతో కలిసి పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ను ఎదుర్కోవాల్సిన భారం పడింది. ఇకపోతే భారత పేస్ దళంలో ప్రీమియర్ పేసర్లు బుమ్రా, షమీ లేకపోవడంతో నవాజ్ ఇది పాకిస్థాన్కు ఫుల్ అడ్వాంటేజీ అవుతుందని పేర్కొన్నాడు. బుమ్రా మరియు షమీ లేని భారత బౌలింగ్పై పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించాలని భావించాడు.
'బౌలర్లే మ్యాచ్లను గెలిపించగలరు. భారత ప్రీమియర్ పేసర్లు బుమ్రా, షమీలు పాక్తో మ్యాచ్కు దూరమవుతున్నారు. పాకిస్తాన్ ఈ భారత బౌలింగ్ పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. చివరిసారిగా టీ20 ప్రపంచకప్లో ఎలాంటి ఫలితాన్ని రాబట్టిందో సేమ్ అదే రిపీట్ కావాలి' అని క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ పేర్కొన్నారు. 'మనం ఈ మధ్య బలహీనమైన జట్లతో ఆడుతున్నాం. భారత్ లాంటి కఠినమైన పోటీదారులను ఎదుర్కోలేదు. అందువల్ల అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకోవాలి.' అని నవాజ్ తెలిపాడు.