
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీని అంతర్జాతీయ మ్యాచ్లో అవుట్ చేస్తే ఆ బౌలర్ రియాక్షన్ వేరుగా ఉంటుంది. భారత్ ఆడే ప్రతి మ్యాచులోనూ కోహ్లీ వికెట్ చాలా కీలకం. అతను కనుక గాడిలో పడితే అవతలి జట్టు ఎంత అద్భుతంగా ఆడినా గెలవడం అసాధ్యం. అందుకే అతన్ని ఎలాగైనా అవుట్ చేసుందుకు బౌలర్లు శ్రమిస్తుంటారు. చాలా మంది యువ బౌలర్లు కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో పాక్ యువ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ కూడా చేరాడు.
పీఎస్ఎల్లో భాగంగా లాహోర్ కలందర్స్ తరఫున ఆడుతున్న రవూఫ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమతో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ ఆజమ్ను రవూఫ్ కలిశాడు. 'ఏదేమైనా సరే నిన్ను, విరాట్ కోహ్లీని ఎప్పటికైనా అవుట్ చేయాలి. అదే నా లక్ష్యం. కేన్ విలియమ్సన్ రెండు సార్లు స్లిప్స్లో బతికిపోయాడు. కానీ నా మైండ్లో ముగ్గురు, నలుగురు ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతానికైతే నువ్వు, విరాట్ ఇద్దరే నాకు చిక్కలేదు' అని రవూఫ్ అన్నాడు.
దీనికి నవ్వేసిన బాబర్.. 'నెట్స్లో కొన్ని సార్లు నన్ను అవుట్ చేశావుగా. ఇంకేంటి?' అని అడిగాడు. అలాక్కాదని, మ్యాచ్లో బాబర్ను అవుట్ చేయాలని రవూఫ్ అన్నాడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో రవూఫ్, కోహ్లీ తలపడ్డారు. మ్యాచ్ ఉత్కంఠగా ఉన్న సమయంలో రవూఫ్ బౌలింగ్లో కోహ్లీ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో మలుపు తిరిగిన మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. అంతకుముందు ఆపియా కప్లో ఆడినప్పుడు కూడా కోహ్లీని అవుట్ చేయడంలో రవూఫ్ విఫలమైన సంగతి తెలిసిందే.