
ఆసియా కప్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ఏ నుంచి సూపర్ 4దశకు చేరుకున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు నేడు తలపడనున్నాయి. గత ఆదివారమే ఈ జట్ల మధ్య రైవల్రీ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వారం తిరక్కుండానే మరో రైవల్రీ మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ అభిమానులకు పండగే. ఇక గత ఆదివారం జరిగిన గ్రూస్ స్టేజ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ను భారత్ ఓడించింది. చివరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠగా ఈ మ్యాచ్ సాగిన సంగతి తెలిసిందే.
ఇక నేటి సూపర్ 4 మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీస్తే చాలు ఇండియాపై గెలవడం ఈజీ అవుతుందన్నట్లు మాట్లాడాడు. పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జట్టులో చాలా ఫామ్లో ఉన్నారని, వారి ఫామ్ను మా జట్టు అర్థం చేసుకుంటుందని, భారత్ను తిప్పలు పెట్టాలంటే వారిని క్రీజులో నిలదొక్కుకోక ముందే ఔట్ చేయాల్సిన అవసరం ఉందని హరీస్ రౌఫ్ చెప్పాడు.
'టీమిండియాలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు ఎవరంటే.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. ఇండియాను కష్టాల్లోకి నెట్టాలంటే ముందుగానే వారి వికెట్లను తీయాలనే ఆలోచనలో మా జట్టు ఉంది. వారు హిట్టింగ్ చేయడానికి ముందు కొంత టైం తీసుకుంటారు. మేము వారికి ఆ స్పేస్ ఇవ్వకుండా ప్రయత్నిస్తాం. వారి వికెట్లను ముందుగానే తీయడం మాకు బెనిఫిట్ అవుతుంది' అని రౌఫ్ అన్నాడు.
ఇకపోతే భారత్ తమ చివరి రెండు గేమ్లలో మంచి ప్రదర్శన కనబరిచింది. మొదట పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 3 వికెట్లు బ్యాటింగ్లో 33పరుగులు చేసి ఇండియాకు విజయాన్ని అందించగా.. హాంకాంగ్తో జరిగిన రెండో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 26 బంతుల్లో 68* పరుగులతో వీరవిహారం చేయడంతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 98పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
తద్వారా ఇండియా 192పరుగుల భారీ స్కోరు చేసి 40పరుగుల తేడాతో గెలుపొందింది. ఇకపోతే మోకాలి గాయం కారణంగా రవీంద్ర జడేజా టోర్నమెంట్కు దూరమయ్యాడు. అతను టీ20 ప్రపంచ కప్కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీమిండియా శిబిరంలో గాయాల వల్ల ఆందోళనలు నెలకొంటున్నాయి. ఇక అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రాబోతున్నాడు. జడ్డూ స్థానంలో దీపక్ హుడా ఆడతాడా లేక అక్షర్ పటేల్ ఆడతాడా అనేది చూడాలి.