IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్ చేతిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మరోసారి చిత్తుగా ఓడింది. ఈ ఘోర పరాజయం తర్వాత పాక్ మాజీ క్రికెటర్లు నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది, మాజీ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్ అంపైరింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫఖర్ జమాన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై వీరు ముఖ్యంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ కోసమే అంపైర్ల పక్షపాతం?
పాకిస్తాన్ ఓటమిపై ఒక టీవీ ఛానెల్లో మాట్లాడుతూ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. అంపైర్లు తమ కెరీర్ను మెరుగుపరచుకోవడానికి ఐపీఎల్లో అవకాశాలు వెతుక్కుంటున్నారని.. అందుకే ఇతర జట్లపై భారత్కు అనుకూలంగా నిర్ణయాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. "వాళ్లు ఐపీఎల్లో కూడా అంపైరింగ్ చేయాలి కదా" అని అఫ్రిది వ్యంగ్యంగా అన్నారు. ఫఖర్ జమాన్ ఔట్ అయినప్పుడు థర్డ్ అంపైర్ సరైన కోణం నుంచి రిప్లే చూడలేదని మహ్మద్ యూసుఫ్ కూడా అఫ్రిది మాటలకు మద్దతు పలికారు.

పాక్ కెప్టెన్ సల్మాన్ ఏమన్నారంటే..
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ మాత్రం అంపైర్ల విషయంలో కాస్త సంయమనం పాటించాడు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, అంపైర్లు పొరపాట్లు చేయవచ్చని అంగీకరించాడు. ఫఖర్ జమాన్ ఔట్ అయినప్పుడు బంతి కీపర్ చేతిలోకి వెళ్లే ముందు బౌన్స్ అయిందని తనకు అనిపించిందని, అయితే తాను తప్పుగా చూసి ఉండవచ్చని అన్నాడు. "ఫఖర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఒకవేళ అతను పవర్ప్లేలో ఉండి ఉంటే, మేము బహుశా 190 పరుగులు చేయగలిగి ఉండేవాళ్లం" అని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) అర్థ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అయితే భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47) విధ్వంసకర బ్యాటింగ్తో 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.