
లాహోర్లో జరిగిన అయిదో టీ20లో ఇంగ్లాండ్పై బాబర్ ఆజామ్ నేతృత్వంలోని జట్టు 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు పాకిస్థాన్నే విజయం వరించింది. ఈ విజయంతో ఏడు మ్యాచ్ల సిరీస్లో 3-2తో పాక్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఆఖరి ఓవర్లో 15పరుగులు డిఫెండ్ చేయాల్సిన తరుణంలో పాకిస్థాన్ డెబ్యూ ప్లేయర్ అమీర్ జమాల్ కేవలం 8పరుగులు మాత్రమే ఇచ్చాడు. క్రీజులో భీకర హిట్టర్ మొయిన్ అలీ ఉన్నప్పటికీ.. అతను కట్టడిగా బౌలింగ్ చేయడం విశేషం. ఇకపోతే పాకిస్థాన్ డిఫెండ్ చేసిన అత్యల్ప టీ20 స్కోరు ఇదే.
ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా వేయడంతో పాటు వికెట్లు తీయడంతో 19ఓవర్లకే పాక్ 145పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (63 పరుగులు 46బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించడంలో పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, సామ్ కరన్ 2, డేవిడ్ విల్లీ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీసి సత్తా చాటారు.
ఇక తర్వాత 146పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 31పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపు డేవిడ్ మలన్ (36) ప్రతిఘటించినా.. బౌండరీలు బాదలేకపోయాడు. ఇక అతను ఔటయ్యాక కెప్టెన్ మొయిన్ అలీ (51పరుగులు 37బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు నాటౌట్) ఛార్జ్ తీసుకుని ఇన్నింగ్స్ విజయం వైపు నడిపించాడు. అయితే చివరి ఓవర్లో మొయిన్ అలీ క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అనిపించింది. పైగా కొత్త కుర్రాడు అమీర్ జమాల్ 20వ ఓవర్ వేయడానికి సిద్ధమయ్యాడు. ఆశ్చర్యకరంగా అమీర్ వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్, లెంత్ ఫుల్ బాల్స్ కట్టుదిట్టంగా వేసి డెత్ స్పెషలిస్టు బౌలర్ అంటే ఏంటో చూపించాడు. అతను చివరి ఓవర్లో ఓ వైడ్, ఓ సిక్స్, ఒక రన్ మాత్రమే ఇచ్చాడు. దీంతో పాక్ విజయం ఖాయమైపోయింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు అందరూ తలా ఓ వికెట్ తీశారు.