హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ వరుసగా మూడు మ్యాచ్లను గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ కువైట్తో తలపడింది. కువైట్ను 43 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ను పాకిస్తాన్ కంటే ఎక్కువ సార్లు మరే ఇతర జట్టు కూడా గెలవలేదు. అయితే ఈ విజయం తర్వాత అచ్చం భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాదిరిగానే ఓ పాకిస్తాన్ ఆటగాడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ క్రికెటర్ ఫోటో కూడా వైరల్ అవుతోంది.
హార్దిక్ పాండ్యా స్టైల్ దించేసిన మహమ్మద్ షెహజాద్
పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ షెహజాద్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో షెహజాద్ హార్దిక్ పాండ్యా స్టైల్లో ట్రోఫీని ముందుంచి భుజాలు ఎగరేస్తూ పోజు ఇవ్వడం గమనార్హం. భారత్ 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ఓ ప్రత్యేకమైన సెలబ్రేషన్ను ప్రారంభించారు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల ఆసియా కప్ గెలిచినప్పుడు కూడా పాండ్యా ఇదే స్టైల్లో సెలబ్రేట్ చేసుకుని ఫోటోలను పంచుకున్నారు.

పాకిస్తాన్-కువైట్ ఫైనల్ మ్యాచ్ వివరాలు
కువైట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ ఆ నిర్ణయం తప్పని తేలింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 13 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది 11 బంతుల్లో 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఖ్వాజా నాఫే 6 బంతుల్లో 22 పరుగులు చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కువైట్ జట్టు 5.1 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాకిస్తాన్ తరఫున మాజ్ సదాకత్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.