
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయంతో ఆసియా కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అతని గైర్హాజరీలో నసీమ్ షా, మహ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్ పాక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు. ఇకపోతే షాహీన్ అఫ్రిది లేకున్నా ఈ ముగ్గురు మ్యాచ్ మలుపు తిప్పే ప్రదర్శన చేయగలరని, భారత టాపార్డర్ను వణికించగలరని పాకిస్థాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ అన్నాడు. ఆసియాకప్లో టఫ్ పోటీని ఇవ్వగలరని పేర్కొన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్లో షాహీన్ అఫ్రిది.. భారత టాపార్డర్ బ్యాటర్లు కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మలను ఔట్ చేయడంతో భారత్ భారీ స్కోరు చేయలేక చతికిల పడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
'గత కొన్నేళ్ల నుంచి పాకిస్తాన్ జట్టు ప్రణాళికలు, డిమాండ్లను ప్రస్తుతం జట్టులో ఉన్న ముగ్గురు పేసర్లు బాగా అమలు చేస్తున్నారు. మా కెప్టెన్ బాబార్ ఆజామ్కు, ప్రధాన కోచ్గా నాకు, మొత్తం సహాయక సిబ్బందికి ఈ ముగ్గురి పేస్ సామర్థాలపై నమ్మకం ఉంది. షాహీన్ ఉండుంటే పేస్ ఎటాక్కు నాయకత్వం వహించేవాడు.. అయితే ఈ ముగ్గురు ఒక నిర్దిష్ట రోజు లేదా ఓ కండిషన్లలో ఆటను మార్చే బౌలింగ్ వేయగలరు. భారత్కు కఠిన సవాల్ విసరగలరు' అని ముస్తాక్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
శ్రీలంకతో సిరీస్లో మొదటి టెస్టులో గాయపడినప్పటి నుంచి షాహీన్ అఫ్రిది ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆసియా కప్ 2022 కోసం ది హండ్రెడ్ టోర్నీలో పాల్గొంటున్న 22ఏళ్ల మహమ్మద్ హోస్నైన్ను అతని స్థానంలో పీసీబీ సెలెక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసింది. షాహీన్ లేకపోవడంతో ఆ జట్టు పేస్ విభాగాన్ని హారిస్ రవూఫ్ నడిపించనున్నాడు. ఇక హసన్ అలీ సైతం ఈ టూర్కు ఎంపిక కాలేదు. హస్నైన్ ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 17వికెట్లు పడగొట్టాడు. ఇకపోతే నసీమ్ ఇప్పటివరకు టీ20 అరంగేట్రం కూడా చేయలేదు. అతను ఇటీవల నెదర్లాండ్స్తో జరిగిన చివరి వన్డేలో 5వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. ఆగస్టు 28న దుబాయ్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.